ఐఏఎస్ ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ? సుప్రీంకోర్టు ప్రశ్న..!
విద్య, ఆర్ధిక పరంగా అభివృద్ధి చెందిన వర్గాల కుటుంబాలు కూడా ఇంకా రిజర్వేషన్ కోరడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ మరోసారి ప్రశ్నించింది. ఇప్పటికే విద్యా, ఆర్థిక పురోగతిని సాధించిన కుటుంబాలు కోటా ప్రయోజనాల కోసం నిరంతరం చేస్తున్న డిమాండ్ను ప్రశ్నించింది. వెనుకబడిన తరగతులలోని ఉన్నత వర్గానికి (క్రీమీ లేయర్కు) రిజర్వేషన్ ప్రయోజనాలకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా, తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ (IAS) అధికారులుగా ఉన్న పిల్లలకు రిజర్వేషన్ అవసరం ఏంటని సుప్రీంకోర్టు సూటి ప్రశ్న వేసింది.
తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే, రిజర్వేషన్ ఎందుకు కోరాలని కోర్టు ప్రశ్నించింది. విద్యా, ఆర్థిక పురోగతి సామాజిక చలనశీలతకు దారితీస్తుందని నొక్కి చెప్పింది. విద్యా, ఆర్థిక సాధికారతతో సామాజిక చలనశీలత ఉంటుంది కాబట్టి మళ్ళీ పిల్లల కోసం రిజర్వేషన్ కోరితే, మనం దాని నుండి ఎప్పటికీ బయటపడలేమని తెలిపింది. ఇది కూడా మనం పరిగణించాల్సిన విషయమని గుర్తుచేసింది. ఇప్పటికే అనేక ప్రభుత్వ ఉత్తర్వులు ఇలాంటి ఉన్నత వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుండి మినహాయిస్తున్నాయని, అయితే ఇప్పుడు ఈ మినహాయింపులను సవాలు చేస్తున్నారని కోర్టు పేర్కొంది.

విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి ఆదాయం పొందుతున్నారు, అయినా పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ కోరుకుంటున్నారు. చూడండి, వారు రిజర్వేషన్ నుండి బయటపడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ప్రయోజనాల ద్వారా కుటుంబాలు ఒక నిర్దిష్ట స్థాయి విద్యా, ఆర్థిక సాధికారతను పొందిన తర్వాత, తర్వాతి తరానికి అర్హతను పునఃపరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) , సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్న రిజర్వేషన్ల మధ్య వ్యత్యాసాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. EWS వర్గానికి సామాజిక వెనుకబాటుతనం లేదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉందని జస్టిస్ నాగరత్న తెలిపారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసి సంబంధిత పక్షాల అభిప్రాయాలు కోరింది.














Click it and Unblock the Notifications