ఏపీలో కర్ఫ్యూ జూన్ 10 వరకూ పొడిగింపు- వేళలు మాత్రం యథాతథం
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ పరిస్ధితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పగటి పూట కర్ఫ్యూను జూన్ 10 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేళల్ని మాత్రం యథాతథంగా ఉంచారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితిపై ఇవాళ సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పగటి పూట కర్ఫ్యూ విధించడంతో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా కర్ఫ్యూ మరోసారి కొనసాగింపుకే మొగ్గుచూపింది. ఇవాళ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కర్ఫ్యూపై నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తగ్గుతున్నా ఇప్పటికిప్పుడే కర్ఫ్యూ ఎత్తేస్తే పరిస్ధితులు మళ్లీ చేదాటిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల ఆరంభంలో ఏపీలో కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయేది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. తాజాగా నిన్న ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లోనూ కేవలం 13000 కేసులే వచ్చాయి. దీంతో మరో పది రోజుల్లో ఈ సంఖ్య భారీగా తగ్గవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. కాబట్టి రెండు వారాలకు బదులుగా పది రోజులకే కర్ఫ్యూ పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 తర్వాత పరిస్ధితిని ప్రభుత్వం మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications