కృష్ణానదిలో బోట్లతో ఫార్ములా వన్ రేస్...ఎపి ప్రభుత్వం నిర్వహణ;నేటి నుంచే సాగర్-శ్రీశైలం లాంచీ!
అమరావతి:కృష్ణా నదిలో ఫార్ములా వన్ బోట్ రేస్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. నవంబర్ నెలలో నిర్వహించే ఈ ఈవెంట్ లో వివిధ దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొంటాయని టూరిజం కార్పొరేషన్ సిఇవో హిమాన్ష్ శుక్లా తెలిపారు.
బుధవారం పర్యాటకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ రేసు వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో ప్రపంచ బోట్ రేస్ చాంపియన్షిప్ నిర్వహిస్తుండగా ఇప్పటి వరకూ 4 దేశాల్లో పూర్తయిందని చెప్పారు. ఈ క్రమంలో ఈ పోటీకి సంబంధించిన ఎఫ్1హెచ్2వో జెండా ఇప్పటికే మన రాష్ట్రానికి చేరిందని చెప్పారు. ఈ రేస్లో అతిధ్య జట్టుగా అమరావతి టీం పాల్గొననుందని, ఇందుకోసం పవర్ బోటు కూడా సిద్ధమైందన్నారు.
కృష్ణా నదిలో...ఫార్ములా వన్ బోట్ రేస్
సెప్టెంబర్ 23న చైనాలో జరిగిన ఈ బోట్ రేస్లో అమరావతి టీం పాల్గొని నాల్గవ స్థానం సాధించిందని శుక్లా తెలిపారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, యుఐఎం ఎఫ్ఎ1హెచ్2ఓ వరల్డ్ చాంపియన్ షిప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి 18 వరకు కృష్ణా నదిలోని భవాని ఐలాండ్ వద్ద మూడు రోజుల పాటు ఈ రేస్లు జరగనున్నాయని శుక్లా వివరించారు. 18వ తేదీన సాయంత్రం ఫైనల్స్ ఉంటాయన్నారు. భారతదేశంలో ఎఫ్ 1 బోట్ రేస్ చివరిసారిగా 2004లో ముంబయిలో జరిగిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు అమరావతిలోనే జరగనుందని శుక్లా చెప్పారు.
విదేశీ జట్లు...అమరావతి టీమ్ కూడా!
ప్రకాశం బ్యారేజ్కు 200 మీటర్లకు దూరంలో 2.5కిలో మీటర్ల రేస్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని, 45 నిమిషాల పాటు రేస్ ఉంటుందని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే ఈ రేసింగ్కు సుమారు లక్షమంది వస్తారని తెలిపారు. పోటీల్లో 10 గ్రూపులు పాల్గొంటున్నాయని, ఒక్కో గ్రూపు నుంచి 15 మంది అమరావతికి వస్తారని తెలిపారు. కేవలం బోటింగ్ గ్రూపుల వారే 500 మంది అమరావతికి వస్తున్నట్లు వివరించారు. వీరి కోసం విజయవాడలోని ఉన్న అన్ని హోటల్ రూమ్స్ను ముందస్తు బుకింగ్ చేస్తున్నామని, అవసరమైన నిధుల కోసం స్పాన్సర్ను ఆశ్రయిస్తున్నామని...అలా ఇప్పటికే రూ.4 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు.
అమరావతి...బ్రాండ్ ఇమేజ్ కోసం
30 శాఖల సహకారంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయనున్నట్లు శుక్లా వివరించారు. అమరావతి టీం జెండాను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పది కళాశాలకు చెందిన విద్యార్థులతో ఈ రేస్పై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయి నుంచి పనులు మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రపంచ స్థాయిలో అమరావతికి పేరు వస్తుందని...అమరావతి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఈ పోటీలను ఏపీకి తీసుకువచ్చామని శుక్లా చెప్పుకొచ్చారు.
నేటి నుంచే...సాగర్-శ్రీశైలం లాంచీ
తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు మరో ఆహ్లదకర ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. నాగార్జునాసాగర్ నుంచి శ్రీశైలానికి కృష్ణానదిలో బోటు ప్రయాణం సర్వీస్ ఈ నెల 10 నుంచీ ఎపి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మొదలు కానుంది. పర్యాటకులకు నల్లమల, కృష్ణానది అందాలను చూపించడంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్ఠాదశ శక్తిపీఠమైన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబాదేవి దర్శనాన్ని కల్పించనున్నారు. వారంలో రెండు రోజులు బుధవారం, శుక్రవారం ఈ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 80 సీట్లు కలిగిన అగస్త్య బోటు 80, వంద సీట్లు సామర్థ్యం ఉన్న నాగసిరి బోటును సిద్ధం చేశారు. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీలో ప్రయాణానికి రానుపోను టికెట్టు ధర పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,800గా నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి సాగర్కు (వన్ వే)టికెట్టు ధర పెద్దలకు, పిల్లలకు రూ.1,290గా ఖరారు చేశారు.