రవాణా శాఖలో పన్నుల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్న ఏపీ సర్కార్.. ఆదాయం పెంచుకునే ప్లాన్
రవాణా శాఖలో పన్నుల బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం . ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్ రవాణా శాఖలో పన్నులు పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా రవాణా శాఖ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా తెలుస్తోంది.
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు .. విద్యుత్ నగదు బదిలీపై సీఎం జగన్ క్లారిటీ
రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా 4వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. అసలే ఆర్ధిక లోటులో ఉన్న రాష్ట్రానికి కరోనామహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది . అయినా సరే ఎక్కడా ప్రజా సంక్షేమం ఆగకుండా పని చేస్తున్న ప్రభుత్వంఇప్పుడు ఆర్ధిక లోటు భర్తీకి ఆదాయ వనరులను పెంచుకోవటంపై దృష్టి పెడుతుంది. పన్నుల పెంపు ద్వారా రవాణా శాఖ నుండి అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తోంది. టూ వీలర్ , ఫోర్ వీలర్ లైఫ్ టాక్స్ పెంచుతూ ఇప్పటికే రవాణాశాఖ ప్రతిపాదనలను రూపొందించిన నేపథ్యంలో ఇకనుంచి వాహనదారులపై పన్ను భారం పడనుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
రెండు శ్లాబులలో లైఫ్ ట్యాక్స్ .. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రవాణా శాఖ
2010 నుండి ఇప్పటివరకు టూవీలర్, ఫోర్ వీలర్ లకు లైఫ్ టాక్స్ లు పెరగలేదు. ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ లైఫ్ టాక్స్ ల వడ్డింపు కు సిద్ధమైంది. 50 వేల రూపాయల ధర కలిగిన టు వీలర్ లకు , ఆపై ధర ఉన్న టు వీలర్ లకు రెండు శ్లాబులలో లైఫ్ టాక్స్ ని చెల్లించేలా ప్రతిపాదనలను రూపకల్పన చేశారు. టు వీలర్ లకు లైఫ్ టాక్స్ ను పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది.
లైఫ్ ట్యాక్స్ 1 నుండి 3 శాతం మేర పెరిగే అవకాశం
ఫోర్ వీలర్ ల విషయానికి వస్తే రూ. 8 లక్షల లోపు ధర కలిగిన ఫోర్ వీలర్ లకు ఒక శ్లాబు , రూ.8 లక్షలకు పైగా ధర కలిగిన ఫోర్ వీలర్ లకు మరో శ్లాబ్ ద్వారా లైఫ్ టాక్స్ చెల్లించడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. లైఫ్ టాక్స్ ని పెంచడం ద్వారా అదనంగా 140 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు రకాల శ్లాబులలో ప్రస్తుతం ఉన్న పన్ను మీద ఒకటి నుండి మూడు శాతం మేర పెంపు చేసేలా చర్యలు తీసుకుంటుంది రవాణా శాఖ. ప్రస్తుతం 9 శాతం 12 శాతంగా ఉన్న టు వీలర్, ఫోర్ వీలర్ లైఫ్ టాక్స్ లు ఇప్పుడు రవాణా శాఖ రూపొందించిన ప్రతిపాదనల మేరకు 1 నుండి 3 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.
Recommended Video
గ్రీన్ ట్యాక్స్ పెంపుతో 30 కోట్ల రూపాయల ఆదాయం పెంచే ప్లాన్
వివిధ వాహనాలకు విధించే గ్రీన్ టాక్స్ రేట్ల పెంపు కూడా చేయాలని రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇక గ్రీన్ టాక్స్ పెంపు ద్వారా అదనంగా 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. గ్రీన్ టాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వనున్నారు . గూడ్సు వాహనాలకు వివిధ శ్లాబుల్లో ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 10-15 శాతం మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అసలే కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల మీద రవాణా పన్నుల బాదుడుకు తెర తీస్తున్నట్లుగా, రవాణా శాఖ ప్రతిపాదనలతో అర్థమవుతుంది.