ఎయిడెడ్ టీచర్ల బదిలీలకు షెడ్యూల్ - కోరుకున్న పాఠశాలలకు విద్యార్ధులు..!!
ఏపీలో కొద్ది కాలంగా ఏయిడెడ్ విద్యా వ్యవస్థ పైన చర్చ సాగుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇది మరింత వివాదాస్పదం కాకుండా ముఖ్యమంత్రి జగన్ గత వారం జరిగిన విద్యా శాఖ సమీక్షలో క్లారిటీ ఇచ్చారు. విద్యాశాఖ పరిధిలో విలీనం అయ్యేందుకు ముందుకు వచ్చిన ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధుల విషయంలో
ఎయిడెడ్ కు చెందిన పలు విద్యా సంస్థల్లో విద్యార్ధుల సంఖ్య లేని చోట ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండి..కొనసాగుతున్న ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో విలీనం చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించిన పాఠశాలల విషయంలో అనుసరించాల్సిన కొన్ని విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలకు సూచించింది.
ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ వెల్లడి
ఈ విద్యార్థులను ఆయా స్కూళ్లలో ఈనెల 31వ తేదీలోగా చేర్పించి ఆ సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో అప్లోడ్ చేయాలని పేర్కొంది. అదే విధంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎయిడెడ్ టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించనున్నారు. దుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేసారు.
Recommended Video
నవంబర్ తొలి వారానికి పూర్తి చేసేలా
దీని మేరకు..అక్టోబర్ 20 నుంచి 22 వరకు జిల్లాల స్థాయిలో టీచర్ల సీనియార్టీ జాబితా రూపకల్పన జరుగుతుంది. అక్టోబర్ 23 సాయంత్రం 5 వరకు ఆ జాబితా ప్రదర్శించాలని నిర్దేశించారు. అక్టోబర్ 24 నుంచి 27 వరకు వాటికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 31న అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియార్టీ జాబితా ప్రకటన ఉంటుందని స్పష్టం చేసారు. ఇక, నవంబర్ 1న యాజమాన్యాల వారీగా ఖాళీల ప్రదర్శన చేపట్టనున్నారు. నవంబర్ 2 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు కోసం నిర్ణయించారు.
ఇక, నవంబర్ 6న కేటాయింపు ఉత్తర్వులు విడుదల కానున్నాయి. నవంబర్ 7న స్కూళ్లలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని షెడ్యూల్ లో స్పష్టం చేసారు. దీని ద్వారా ఎయిడెడ్ టీచర్లు..విద్యార్ధులకు సంబంధించి ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది. దీని పైన ఏ రకమైన స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది.