ఏపీలో రేషన్ వాహనాల రద్దు వెనుక కారణాలివే..! జీవోలో వెల్లడించిన ప్రభుత్వం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటి రేషన్ పంపిణీకి తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలను ఆపేయాలని నిర్ణయించింది. ఈ వాహనాల ద్వారా అనుకున్న ప్రయోజనం నెరవేరడం లేదని భావించిన ప్రభుత్వం వీటి స్ధానంలో తిరిగి రేషన్ దుకాణాలను తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటన చేశారు.
దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేషన్ పంపిణీకి వాడే ముబైల్ వాహనాలు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పౌరసరఫరాల వ్యవస్ధ నుంచి 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలు (రేషన్ వాహనాలు) రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల నుంచే బియ్యం, ఇతర సరకుల పంపిణీకి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో ఈ వాహనాలు ఇకపై అదృశ్యం కానున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్కో రేషన్ వాహనాన్ని రూ.5.81 లక్షలకు కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తెలిపింది. అయితే అప్పట్లో చేసుకున్న ఒప్పందం మేరకు రేషన్ సరకుల్ని ఈ వాహనాలు డోర్ డెలివరీ చేయలేకపోయాయని ప్రభుత్వం జీవోలో తెలిపింది. లబ్ధిదారుల ఇంటికి రేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ వాహనాలతో నెరవేరలేదని జీవోలో వెల్లడించింది. అలాగే కొత్త ప్రభుత్వ విధానం ప్రకారం వచ్చే నెల నుంచి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ చౌక దుకాణాల్లో రేషన్ సరకులు లభిస్తాయని తెలిపింది.
రేషన్ వాహనాల రద్దు వెనుక ఉన్న పలు కారణాల్ని ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఇందులో 1801 కోట్లు పెట్టి కొన్న ఈ వాహనాలు ఆ స్ధాయిలో ఉపయోగపడటం లేదని పేర్కొంది. ఇవి ఇంటింటి రేషన్ పంపిణీలో విఫలమైనట్లు తెలిపింది. రేషన్ కార్డుదారులు ఈ వాహనాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. సకాలంలో రేషన్ తీసుకోని వారు ఈ వాహనాల ద్వారా 17వ తేదీన వారు చెప్పిన చోట తీసుకోవాల్సిన రావడం ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. రేషన్ అక్రమ రవాణా, దారి మళ్లింపులకు ఈ వాహనాలు కారణమవుతున్నాయని కూడా తెలిపింది. కాబట్టి వీటిని రద్దు చేసి బ్యాంకులకు రుణ బకాయిలు చెల్లించాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications