ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఇక ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్ట్ రిపోర్ట్ నేరుగా వారికే .. రీజన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాటెస్ట్ ల విషయంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కరోనా టెస్ట్ నిర్వహించిన వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ ను సంబంధిత వ్యక్తి కే ఎస్ఎంఎస్ రూపంలో పంపించనుంది. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాల కోసం ఇకపై సంబంధిత వ్యక్తి నమోదు చేసుకున్న సెల్ ఫోన్ నెంబర్ కే కరోనా టెస్ట్ ఫలితాన్ని పంపించడం ద్వారా సంబంధిత పాజిటివ్ వ్యక్తి కరోనా వైద్య చికిత్స తీసుకోవడానికి త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మురుగు నీటిలోనూ కరోనా వైరస్ .. అది వ్యాప్తి చెందుతుందా : గుజరాత్ ఐఐటీ పరిశోధన ఏం తేల్చింది
ల్యాబ్ నుండి వైద్యులకు రిపోర్ట్స్ చేరటంతో కొన్ని సమస్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వ్యక్తి ఫలితాలు ల్యాబ్ నుండి నేరుగా ఆన్ లైన్ ద్వారా వైద్యులకు,సంబంధిత ఆసుపత్రుల సూపరిండెంట్ లకు తెలియజేస్తున్నారు. దీంతో వారు సరిగా గుర్తించుకుంటే కొన్ని సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పరీక్షలు చేయించుకున్న వ్యక్తి వైద్యుల నుండి తన పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో పరీక్ష చేయించుకున్న వ్యక్తికే ఫలితాన్ని పంపించడం వల్ల వారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందని భావించిన ఏపీ సర్కార్ వారికి నేరుగా సెల్ నెంబర్ కు ఫలితాన్ని పంపించనున్నారు.
నేరుగా టెస్ట్ ఇచ్చిన వ్యక్తికే కరోనా టెస్ట్ ఫలితం .. వారిని అలెర్ట్ చెయ్యటానికి నిర్ణయం
ఇక ఈ విధానాన్ని ఏపీలో అమలులోకి తెచ్చామని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఇక ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని నేరుగా సదరు వ్యక్తికి పంపించే విధానాన్నిగత నెలలోనే అమల్లోకి తీసుకువచ్చారు. సకాలంలో కరోనా పరీక్షల ఫలితాల యొక్క సమాచారం బాధితులకు, అనుమానితులను అందేలా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా సెల్ ఫోన్ కి సమాచారం అందేలా చూస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే అనంతపురం జిల్లాలో ఈ విధానాన్ని ప్రారంభించిన అధికారులు అక్కడ ఈ విధానం సక్సెస్ కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో సక్సెస్ అయిన ఎస్ఎంఎస్ విధానం
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే బాధితులు సెల్ నెంబర్ కు సంబంధిత జిల్లా కలెక్టర్ పేరు మీద మెసేజ్ వెళ్తుంది. ఇక ఆ మెసేజ్ లో సదరు వ్యక్తి పేరు, వారి ఐడి నెంబర్, కరోనా పాజిటివ్ అయితే... క్షమించండి మీ ఐడి కింద కోవిడ్ 19 పరీక్ష మీకు పాజిటివ్ వచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుంది. మీరు కోవిడ్ తో పోరాడి ఆరోగ్యవంతంగా డిశ్చార్జి అవుతారని సందేశం వస్తుంది. ఒకవేళ కరోనా నెగిటివ్ అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మీ ఐడి నెంబర్ క్రింద కోవిడ్ 19 పరీక్ష నెగిటివ్ వచ్చింది అని సందేశం వస్తుంది. ఇక ఈ విధానం ద్వారా బాధితులే తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి అప్రమత్తమై వైద్య చికిత్స పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.