అవునా...ఎపి ప్రభుత్వం తప్పు చేసి...కేంద్రానికి దొరికిపోయిందా?...అందుకనే అంత కోపమా...?
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఆ వార్త ప్రకారం ఎపి ప్రభుత్వం ఒక పెద్ద తప్పు చేసి కేంద్రానికి దొరికిపోయిందట...అందుకే ఆ విషయమై కేంద్రం ఎపి గవర్నమెంట్ పై తీవ్ర ఆగ్రహంతో ఉందట...ఇంతకీ ఎపి ప్రభుత్వం చేసిన ఆ తప్పేమిటంటే...
రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 1583 కోట్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికేట్ కేంద్రానికి ఇచ్చేసిందట. ఇప్పుడు ఆ విషయం మీదే కేంద్ర ప్రభుత్వం ఎపి గవర్నమెంట్ పై మండిపడుతోందట. అదేంటి యుసి ఇస్తే తప్పేమిటి అనే కదా మీ డౌట్...అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే...
విభజన చట్టం ప్రకారం సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణాలకు కేంద్రమే నిధులు సమకూర్చాలి. సరే, విభజన చట్టంలో ఇంకా చాలానే చేయాల్సి ఉన్నా వీటి వరకూ ముందుగా కేంద్రం నిధులు విడుదల చేసేసింది. వీటిని రాష్ట్రప్రభుత్వమూ ఖర్చు చేసేసింది. అయితే, ఇప్పుడు సమస్య అంతా ఇక్కడే మొదలైంది...అదెలాగంటే ఎపి నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్ళల్లో కట్టింది తాత్కాలిక సచివాలయం,అసెంబ్లీ మాత్రమే. వాటి నిర్మాణంలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. కేంద్రమేమో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు నిధులిస్తే ఒక్క సచివాలయం మినహా ఇంకేమీ కట్టలేదు.
అయితే ఇప్పుడు ఎపి ఇచ్చిన యూసీ చూసి కేంద్రానికి మండిపోయిందట. ఎందుకంటే ఎపి కేంద్రానికి పంపిన యూసిలో సచివాలయంతో పాటు హైకోర్టు, రాజ్ భవన్ కూడా నిర్మించేసినట్లు ఉందట. మరి వాటిని నిర్మించకుండానే కట్టినట్లు రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి యూసిని ఎలా, ఎందుకు పంపిందన్నదే అర్ధం కావటం లేదంటున్నారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్ లో హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాంచకుండానే నిర్మించేసినట్లు యూసి పంపడంతో సమస్య మొదలైంది. పై రెండింటిని కట్టకుండానే కట్టేసినట్లు యూసిని పంపిందంటే అర్ధమేంటి? వాటికోసం కేటాయించిన డబ్బును రాష్ట్రప్రభుత్వం ఇంక దేనికో వాడేసింది.ఈ విషయంలోనే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వంపై కోపం వచ్చిందట. అందుకే కేంద్రం ఎపి విషయంలో అంత ముభావంగా ఉంటోందని, పైగా తాము విడుదల చేసిన ప్రతీ రూపాయికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడుగుతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.