ఏపీలో ఉచిత బస్సు వేళ ఆటో డ్రైవర్లకు ఇచ్చేదెంత ? సర్కార్ లెక్కలేంటి ?
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను కేబినెట్ ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంద్రాగస్టు కానుకగా మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఇలా ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్ధితి ఏంటన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు కారణంగా వేల సంఖ్యలో ఆటో డ్రైవర్లు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గత వైసీపీ సర్కార్ హయాంలో వాహన మిత్ర పథకం కింద ఏటా రిపేర్లు, ఇన్సూరెన్స్ కోసం ఇచ్చే 10 వేల రూపాయలు ఆగిపోయాయి. ఇప్పుడు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తే ఇక ఆటో ఎక్కే మహిళల సంఖ్య భారీగా తగ్గిపోవడం ఖాయం. దీంతో వీరికి కూడా ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

అయితే మరో ఆరు రోజుల్లో ఉచిత బస్సు పథకం మొదలవుతున్న వేళ ఆటో డ్రైవర్లకు ఎంతిస్తారన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్లు 10 వేలు ఇస్తే సరిపోతుందన్న భావన పలువురు మంత్రుల్లో కనిపిస్తోంది. అయితే అప్పట్లో ఆటో రిపేర్లు, ఇన్సూరెన్స్ కోసమే ఇలా 10 వేలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అదే 10 వేలు ఇచ్చినా ఏమాత్రం సరిపోవనే ఆందోళన ఆటో డ్రైవర్లలో కనిపిస్తోంది.

అయితే ప్రభుత్వం మాత్రం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా పరిహారం ఇస్తామని తాము ఎన్నికల హామీ ఇవ్వలేదు కాబట్టి 10 వేలు ఇస్తే సరిపోతుందన్న యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వనున్నట్లు శ్రీకాకుళంలో ప్రకటించారు. అంతకు మించి ఇచ్చేందుకు రాష్ట్రంలో ఆర్ధిక వనరులు కూడా సరిపోవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లలో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications