అమరావతిపై సుప్రీంలో కేవియట్ - బడ్జెట్ లో రాజధాని కోసం ఇలా : ఈ సమావేశాల్లోనే కొత్తగా..!!
అమరావతి భవిష్యత్ ఏంటి. మూడు రాజధానులే తమ వైఖరి అంటున్న ప్రభుత్వం ఏం చేయబోతోంది. 2022-23 వార్షిక బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్కడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదు. గవర్నర్ ప్రసంగంలో పరోక్షంగా తమ విధానం వికేంద్రీకరణ అని..దాని కోసం మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ, బడ్జెట్ లో మాత్రం మూడు రాజధానుల ఊసే లేదు. అదే సమయంలో రాజధాని గా అమరావతి విషయంలో తమ వైఖరి స్పష్టం చేయలేదు. ఇదే సమయంలో సుప్రీంలో అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేవియట్ పిటీషన్ దాఖలైంది.
Recommended Video

హైకోర్టు తీర్పు..సుప్రీం లో కేవియట్
హైకోర్ట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తే.. తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వొద్దని మన్నవ సుబ్బారావు, రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు అమరావతి విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయాలని.. 3 నెలల్లో రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలనిహైకోర్టు తీర్పు ఇచ్చింది. మాస్టర్ప్లాన్ను అనుసరించి 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో..బడ్జెట్ లో అమరావతి పైన ప్రభుత్వం ఏం చేయబోతోందునే ఆసక్తి కనిపించింది.

తాజా బడ్జెట్ లో ప్రతిపాదనలు
తాజాగా ఆర్దిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 1329.21 కోట్లు కేటాయించినట్టుగా చూపించి, అందులో 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని అంచాల్లో పేర్కొంది. బడ్జెట్ కేటాయింపుల్లో సీఆర్డీఏకి సాయం పేరుతో రూ. 200 కోట్లు కేటాయించింది. గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. 2021-22 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు సంవత్సరానికి రూ. 550 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో రూ. 200 కోట్లే చూపించారు. రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి పేరుతో మరో రూ. 121.11 కోట్లు ప్రతిపాదించారు.

కోర్టు తీర్పుతో ప్రస్తావన లేని మూడు రాజధానులు
అమరావతి గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ కేటాయింపులు చేశారు. కొత్త రాజధాని కోసం భూసమీకరణ పేరుతో మరో రూ. 208.10 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు నిమిత్తం చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ సమావేశాల్లోనే ఈ రాజధాని వ్యవహారం పైన కొనసాగుతున్న డైలమాకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ పైన చర్చ ముగిసిన తరువాత రాజధాని అంశం పైన ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించే ఛాన్స్ ఉంది. మూడు రాజధానులు తమ విధానమంటూ మంత్రులు పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పు పైన ప్రభుత్వం సుప్రీంకు అప్పీల్ కు వెళ్లలేదు.

ఈ సమావేశాల్లోనే క్లారిటీ ఇస్తారంటూ
తాజాగా మంత్రి బొత్సా..2024 వరకు హైదరాబాద్ రాజధాని అంటూ పునర్విభజన చట్టంలో చేసిన నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు. పరోక్షంగా అమరావతి రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ఖరారు చేసినా..పార్లమెంట్ కు సమాచారం ఇవ్వలేదని చెప్పటం ద్వారా..ఇంకా అధికారికంగా అమరావతిని రాజధానిగా గుర్తించలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు ఈ సమావేశాల్లో ప్రభుత్వం రాజధాని పైన క్లారిటీ ఇస్తుందని ముఖ్యులే చెబుతుండటంతో..ఏ రకంగా అమరావతి విషయంలో ముందుకెళ్తుందీ... ఏం చేయబోతోందీ.. కొత్తగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications