చిరంజీవి ట్వీట్ పై జగన్ సర్కార్ రియాక్షన్-టికెట్ల ధరలపై సీఎంతో చర్చిస్తామన్న పేర్నినాని
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారీ చిత్రాల నిర్మాతల గుండెల్లో ఇది రైళ్లు పరిగెత్తిస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి వాటిని సాధారణ టికెట్ల ధరలతో ప్రదర్శిస్తే తమకు నష్టాలు తప్పవని భావిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు చిరంజీవితో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ మంత్రి పేర్నినానికి కూడా ఫోన్లు చేస్తున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచరాదన్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని సీఎం జగన్ ను కోరుతూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ మంత్రి పేర్నినాని ఇవాళ స్పందించారు. చిరంజీవి ట్వీట్ ను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి టికెట్ల ధరల సమీక్షపై చర్చిస్తామన్నారు. ఈ మేరకు గతంలో తాము జారీ చేసిన జీవో 35పై సమీక్షించనున్నట్లు చిరంజీవికి ఆయన హామీ ఇచ్చారు. చిరంజీవి జీవో 35లో కొన్ని మార్పులు చేయాలని గతంలో సీఎం దృష్టికి తీసుకొచ్చారని, టికెట్లు రేట్ల పెంపు అంశంలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని పేర్ని తెలిపారు.

సినిమా టికెట్ల ధరలపై నిర్మాతలు, సినిమా పెద్దల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని పేర్ని నాని తెలిపారు అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై సీఎం గారితో చర్చించి చెప్తామని సినీ పెద్దలకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి సినీ పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై తాము పరిశీలన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మిగతా అంశాల్ని మాత్రం యథాతథంగా అమలు చేస్తామని మంత్రి పేర్ని తెలిపారు. దీంతో టాలీవుడ్ కోరుతున్న ఓ కీలక అంశంపై ప్రభుత్వం సమీక్షకు సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications