కృష్ణా జలాల గొడవ: లేని రాష్ట్రంపై తెలంగాణ ఫిర్యాదు!
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశే లేనప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆరోపణలు చేయడమేమిటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయనుందని తెలుస్తోంది.
విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండూ కొత్త రాష్ట్రాలేనని, రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఏపీ సమష్టి నిర్ణయాలు తీసుకొందని, ఇప్పుడు ఉమ్మడి ఏపీ లేనందున తెలంగాణ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కృష్ణా జలాల వ్యవహారంలో వివాదమనేదే ఉండదని ఏపీ స్పష్టం చేయనుందని సమాచారం.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని గతేడాది జులై 14న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. బచావత్ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్లు వాదనలు జరగలేదని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లోనూ అన్యాయం జరిగిందని వివరించింది.
దీన్ని సవరించడానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా గడువు పొడిగించిన ట్రైబ్యునల్కు అప్పగించాలని ఆ లేఖలో కోరింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏపీకి లేఖ రాసింది. కేంద్రానికి పంపేందుకు సిద్ధమైంది.