ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ : సినీ ఇండస్ట్రీకి భారీ రిలీఫ్..!!
ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఏపీలో సినిమా ధియేటర్ల పైన తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగించారు. దీని పైన పవన్ కళ్యాణ్ లాంటి వారు విమర్శలు చేసారు. చిరంజీవి..నాగార్జున..అల్లు అరవింద్ లాంటి వారు ప్రభుత్వానికి వినతుల ద్వారా తమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేసారు. ఇక, ప్రధానంగా తెలంగాణ లో ఇప్పటికే సినిమా ధియేటర్లు పూర్తిగా తెరుచుకున్నా..ఏపీలో మాత్రం ఇప్పటి వరకు 50 శాతం ఆక్సుపెన్సీ మాత్రమే కొనసాగుతూ వచ్చింది.

ధియేటర్ల పైన కోవిడ్ ప్రభావం
అందునా రాత్రి పూట కర్ఫ్యూ అమలు కారణంగా.. సెకండ్ షో కు అనుమతులు దక్కలేదు. దీంతో..కొత్త సినిమాలు విడుదల చేసినా..సినిమా ధియేటర్లతో ఆక్యెపెన్సీ శాతం తక్కువగా ఉండటం..అసలు ప్రేక్షకులు ధియేటర్లకు గతంలో మాదిరిగా వస్తారా అనే అనుమానాలు సినీ పెద్దల్లో కనిపించింది. దీని కారణంగానే సినిమా తీయటానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది..తిరిగి అది రాబడిగా వస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నాయంటూ మెగాస్టార్ చిరంజీవి ఓపెన్ గానే అనుమానాలు వ్యక్తం చేసారు.

సినీ పెద్దల వినతులు..వివాదాలు
దీని కారణంగానే తాను నటించిన ఆచార్య మూవీ పూర్తయినా..రిలీజ్ ఆలస్యం అవుతోందని చెప్పకొచ్చారు. ఇక, నాగార్జున సైతం ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం ప్రధానమని..తెలంగాణలో 100 శాతం ఆక్యెపెన్సీతో సినిమా ధియేటర్లు నడుస్తుంటే..ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇక, ఇప్పుడు ఏపీలోనూ సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్కు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లతోపాటు ఫిక్స్డ్ సీటింగ్ ఉన్న ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాల్లోనూ వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చింది.

100 శాతం ఓకే..కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే
ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తాజా మార్గదర్శకాలు గురువారం నుంచి ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్కే అనుమతి ఉండేది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు సడలిస్తూ ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో 250 మందికి అనుమతిచ్చింది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి పండుగ లాంటి వార్త
కానీ, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూ వేళలనూ కుదించింది. ఇప్పటి వరకు రాత్రి 11 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండేది. దీన్ని రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు పరిమితం చేసింది. దీని ద్వారా సాయంత్రం నుంచి ప్రదర్శించే ఫస్ట్ షో, సెకండ్ షో లకు సైతం ఇబ్బందులు తొలిగిపోయినట్లే. ఈ దసరా సమయంలో తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.
Recommended Video

తెలుగు సినీ పరిశ్రమకు భారీ రిలీఫ్..
ఇప్పుడిప్పుడే కరోనా కోరల నుంచి బయట పడుతూ సాధారణ ప్రజలు గతంలో మాదిరిగా సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. దీంతో..సినిమా ధియేటర్లకు వచ్చే స్పందన చూసిన తరువాత..పెద్ద హీరోలు- పెద్ద బడ్జెట్ సినిమాల విడుదలకు సంబంధించి వేగంగా నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం టాలీవుడ్ కు రిలీఫ్ ఇచ్చేదిగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications