డీఎస్సీపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం..వారికి జాబ్ గ్యారెంటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము ప్రతి సంవత్సరం ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఏపీ మంత్రి సబిత తెలిపారు.
డీఎస్సీ అంటేనే టిడిపి
ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం పైన మండిపడిన ఆమె ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ జగన్ నిరుద్యోగ యువతను ఐదేళ్లపాటు దగా చేసాడని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉందని పేర్కొన్న ఆమె టిడిపి అంటే డిఎస్సీ, డీఎస్సీ అంటేనే టిడిపి అంటూ పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ లో టీచర్ పోస్టులు వచ్చిన వారికి సీఎం నియామకపత్రాలు అందజేత
నేడు పెనుగొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల మెగా డీఎస్సీలో పెనుగొండ నియోజకవర్గం నుంచి టీచర్ పోస్టులు సాధించిన 70 మంది అభ్యర్థులను సత్కరించిన ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 2025 మెగా డీఎస్సీ లో టీచర్ పోస్టులు సాధించిన 15,941 అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందించారని గుర్తు చేశారు.
డీఎస్సీ ప్రక్రియను సమర్ధవంతంగా నడిపింది లోకేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై తొలి సంతకం పెట్టారని, డీఎస్సీ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి ఇది అని ఆమె పేర్కొన్నారు. కేవలం 150 రోజుల కాలంలో డీఎస్సీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత మంత్రి లోకేష్ దని ఆమె అన్నారు. వైసిపి నాయకులు మెగా డిఎస్సి అడ్డుకోవడానికి 105పైగా కోర్టుల్లో కేసులు వేశారని, వాటన్నింటినీ అధిగమించి డీఎస్సీ నిర్వహించిన ఘనత లోకేష్ దే అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 15 ఏళ్ల కాలంలో 14 సార్లు డీఎస్సీ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 15ఏళ్ల కాలంలో 14సార్లు డీఎస్సీని నిర్వహించారని, దాదాపు రెండు లక్షల వరకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ కోసం కూడా బీసీ అభ్యర్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఉచిత శిక్షణ అందించామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిలో 270 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారని మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు.
బాబు తోనే జాబు అనే భావన నిజం చేశాం
మెగా డీఎస్సీ ద్వారా బాబు తోనే జాబు అని నిరుద్యోగుల భావనను నిజం చేశామన్నారు . గత ఐదేళ్ళ కాలంలో జగన్ ఏనాడు డీఎస్సీ గాని ఇతర పోటీ పరీక్షలు కానీ నిర్వహించలేదు అన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, బీసీ అభ్యర్థులకు బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. అత్యధిక బీసీ అభ్యర్థులు టీచర్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications