జగన్ పుట్టినరోజు కానుక- విద్యార్ధులకు 4.3 లక్షల ట్యాబ్ లు-ఈసారి కొత్త యాప్ లు ఇవే!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులకు మరోసారి ట్యాబ్లెట్ పీసీల పంపిణీ కోసం ప్రభుత్వం సిద్దమవుతోంది. గతేడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు 5 లక్షలకు పైగా ట్యాబ్ లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి 4.3 లక్షల మందికి ఈ కానుక ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈసారి ఇచ్చే ట్యాబ్ ల్లో పలు మార్పులు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఇఫ్లూ సహకారంతో విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా కొత్త యాప్ కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు 4.3 లక్షల ట్యాబ్ లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో ఇప్పటికే 2.5 లక్షల ట్యాబ్ లు విజయవాడకు చేరాయి. మరో 1.8 లక్షల ట్యాబ్ లు వచ్చే వారంలో అందుబాటులోకి వస్తాయి. వీటిని ప్రాంతీయ విద్యాశాఖాధికారుల కార్యాలయాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి స్కూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఇచ్చే ట్యాబ్ ల సామర్ధ్యం పెంపుతో పాటు పలు మార్పులు చేస్తున్నారు.

గతేడాది ఇచ్చిన ట్యాబ్ ల్లో ర్యామ్ 3 జీబీ మాత్రమే ఉండగా.. ఈసారి దాన్ని 4జీబీకి పెంచారు. అలాగే గతేడాది 32జీబీ ర్యామ్ ఇంటే ఈసారి దాన్ని 64 జీబీకి పెంచారు. గతేడాది 64 జీబీ ఎస్డీ కార్డు ఇస్తే ఈసారి దాన్ని 256 జీబీకి పెంచారు. స్క్రీన్ సైజు మాత్రం 8.7 అంగుళాలు మాత్రమే ఉంచారు. మరోవైపు ఈసారి ఇచ్చే ట్యాబ్ ల్లో 8వ తరగతి కంటెంట్ తో పాటు 9, 10 తరగతుల ఈ-కంటెంట్ సైతం నింపుతున్నారు. ఈసారి ట్యాబ్ ల్లో రెండు కొత్త యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈసారి విద్యార్దులకు ఇచ్చే ట్యాబ్ లలో ఈ ట్యూటర్, డ్యులింగో యాప్ లు అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) సాయంతో విద్యార్ధుల సందేహాలు నివృత్తి చేసేందుకు వీలుగా ఈ-ట్యూటర్ యాప్ ను, అలాగే ఇఫ్లూ సహకారంతో విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యులింగో యాప్ ను ఇన్ స్టాల్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ-డిక్షనరీ యాప్ కూడా ఇన్ స్టాల్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇంటర్ సిలబస్ ను కూడా నింపేలా ఈ ట్యాబ్ ల్లో స్పేస్ అందబాటులో ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications