ఏపీలో కొత్త రేషన్ కార్డులు - అర్హతలు ఖరారు, పాతవి రద్దు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అర్హతలను ఖరారు చేసింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయనుంది. అదే విధంగా.. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారటంతో.. అర్హతల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.
కొత్త రేషన్ కార్డులు
ఏపీలో వచ్చే సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను అనుగుణంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైనింగ్ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి కొత్తగా అందరికీ కొత్త డిజైన్ తో కార్డులు అందించనున్నారు.

అధికారుల కసరత్తు
కొత్త కార్డుల తయారీతో పాటుగా నూతన కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం పైన అధికంగా భారం లేకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లేత పసుపు రంగు కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. గత ప్రభుత్వంలో కొత్త కార్డుల కోసం వచ్చిన 30,611 దరఖాస్తులతోపాటు స్ల్పిట్ కార్డుల కోసం 46,918 వచ్చాయి. సభ్యుల చేర్పుల కోసం 2,13,007 దరఖాస్తులు రాగా.. ఇక, తొలగింపు కోసం వచ్చినవి 36,588 గా అధికారులు వెల్లడించారు. చిరునామా మార్పు కోసం వచ్చిన 8,263 దరఖాస్తులతో పాటుగా కార్డుల సరెండర్ కోసం వచ్చినవి 685 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
జనవరిలో పంపిణీ
ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా, వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు. వీటికి ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ అందుతోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులు అందుతున్నాయి. వీటిపై ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో, ప్రభుత్వం పై అదనపు భారం పడకుండా కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన అధికారుల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జనవరిలో జన్మభూమి -2 ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications