ఏపీ స్కూల్స్ లో ఆధార్ స్పెషల్ క్యాంప్స్..! తేదీలు, ఇతర వివరాలివే..!
ఈ రోజుల్లో పిల్లలకు ఆధార్ కార్డులు తీసుకోవడం ఓ ఎత్తయితే, వాటిని సందర్భాన్ని బట్టి అప్ డేట్ చేయించుకోవడం మరో తలనొప్పిగా మారింది. ఆధార్ కేంద్రాలకు వెళ్తే అక్కడ సిబ్బంది ఉంటారో లేదో తెలియదు, పిల్లలకు అయితే ఇక్కడ కాదు అక్కడ అంటూ పలు చోట్లకు తిప్పుతుంటారు. సంక్షేమ పథకాలకు అర్హులైన విద్యార్దులకు అయితే మరిన్ని సమస్యలు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్ధులకు వారు చదువుకునే స్కూళ్లలోనే ఆదార్ కార్డుల్ని అప్ డేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం స్కూళ్లలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహించబోతోంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకూ స్కూళ్లలోనే ఆధార్ అప్ డేషన్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సచివాలయాల శాఖ ప్రకటించింది. ఈ క్యాంపుల్లో బయోమెట్రిక్ అప్ డేట్ కాని విద్యార్ధులు దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

యూనిక్ ఆధార్ ఐడెంటికేషన్ అథారిటీ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటివరకూ ఆధార్ కార్డుల్లో బయో మెట్రిక్ (వేలి ముద్రలు) నమోదు కాని విద్యార్ధులకు ఈ స్పెషల్ క్యాంపుల నిర్వహణ ద్వారా తప్పనిసరిగా వాటిని అప్ డేట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సచివాలయాల శాఖ ప్రత్యేక ఆదేశాలు ఇస్తోంది. స్కూల్స్ కు సమీపంలోని సచివాలయాల సిబ్బంది అక్కడికి వచ్చి ఈ ప్రత్యేక ఆధార్ అప్ డేట్ క్యాంపులు నిర్వహిస్తారు. కాబట్టి విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications