ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వండి: ఏపీ సిఫార్సు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రకటించబోయే దేశ అత్యున్నత స్థాయి పౌరపురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పేర్లను ప్రతిపాదిస్తోంది.
పద్మశ్రీ అవార్డుల కోసం ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాస రావు, ప్రముఖ కార్టూనిస్టు పేర్లను సిఫార్సు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా పద్మ అవార్డులకు సిఫార్సు చేస్తూ ఆ జాబితాను ఈ నెల 15న కేంద్రానికి పంపాలని నిర్ణయించనున్నట్లు సమాచారం.
కాగా, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఉన్న డిమాండును సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం తీర్చింది. అలాగే భారతరత్న కోసం కూడా చాలా రోజులుగా డిమాండ్లు ఉన్నాయి.