వైసీపీ సర్కార్లో మరో దేశద్రోహం కేసు-జడ్జి రామకృష్ణపై-జగన్పై కంసుడి వ్యాఖ్యలతో
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండో దేశద్రోహం కేసు నమోదైంది. సీఎం జగన్పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. స్ధానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ఛీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపైనా వైసీపీ సర్కార్ దేశద్రోహం కేసు నమోదు చేసింది.

ఏపీలోనూ దేశద్రోహం కేసులు
జాతీయ స్దాయిలో మోడీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వరుసగా దేశద్రోహం కేసులు పెడుతుండగా.. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటికే మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కార్ నిఘా పరికరాల కొనుగోలు కేసులో దేశద్రోహం కేసు నమోదు చేయగా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణపైనా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో వైసీపీ హయాంలో ఇది రెండో దేశద్రోహం కేసుగా రికార్డులలెక్కింది.

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్డి రామకృష్ణ కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వంపైనా, మంత్రి పెద్దిరెడ్డిపైనా, సీఎం జగన్పైనా విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఆయన్ను గతంలో ఓసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరోమారు ఆయన సీఎం జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది. దీంతో ఆయనపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అంతే కాదు స్దానిక కోర్టులో హజరు పరిచి 14 రోజుల రిమాండ్కు కూడా పంపారు.

జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలివే...
ఈ నెల 12న ఓ టీవీ ఛానల్ అమెరికా మానవ హక్కుల నివేదిక 2020పై నిర్వహించిన చర్చలో పాల్గొన్న జడ్డి రామకృష్ణ.. జగన్ కంసుడిలా తయారయ్యాడు. ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి నేను కృష్ణుడిగా భావించి, నరకాసురుడు, కంసుడైన జగన్ను ఎప్పుడు శిక్షించాలా అని ఎదురుచూస్తున్నానని అన్నట్లు పోలీసులకు జయరామచంద్రయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పీలేరు పోలీసులు.. జడ్జి రామకృష్ణపై సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం కేసుతో పాటు సెక్షన్ 153, 153ఏ కింద వివాదాస్పద వ్యాఖ్యల కేసుల్ని కూడా నమోదు చేశారు.

అరెస్టు చేసిన తీరుపై విమర్శలు
జడ్జి రామకృష్ణ సీఎం జగన్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పీలేరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రామకృష్ణ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తుండగా.. పీలేరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్దానిక పీఎస్కు తీసుకెళ్లి అరెస్టు చేశారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపారు. పోలీసుల తీరుపై ఆయన కుమారుడు వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి ఏమైనా జరిగితే ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications