ఆ తర్వాతే టీఆర్ఎస్పై కేసు: ట్యాపింగ్పై బాబు వెయిట్ అండ్ సీ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్టు, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఏపీకి చెందిన 120 ఫోన్ల వరకు తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఏపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ పైన ఏపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రస్తుతానికి కొంత సంయమనం పాటించాలని భావిస్తోంది. కేంద్రానికి ఫిర్యాదు చేసినందున అటువైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేంద్రం సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉన్నప్పటికీ చర్యలకు కాస్త సంయమనం పాటించాలని భావిస్తోంది. సీఎం సహా మొత్తం 120 మంది ఫోన్లు ట్యాప్ చేశారని నిర్ధారించుకున్న ఏపీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ట్యాపింగ్ కేంద్ర హోంశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంపై కేసులు నమోదు చేయవచ్చునని న్యాయనిపుణులు ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారని సమాచారం.
అంతవరకు సంయమనం పాటించాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంశాఖ నుంచి నివేదిక రాగానే కేంద్రం తీసుకునే చర్యలతోపాటు కేసులు నమోదు చేసి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉత్కంఠకు గుగి చేస్తోంది.