AP Elections: ఏపీలో జోరుగా పోలింగ్..! ఓటేసిన ఏపీ గవర్నర్, సీఈవో మీనా..!
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఈసీ వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దుతోంది. దీంతో తొలి రెండు గంటల్లో సగటున 4 శాతం వరకూ ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కూడా ఓటేశారు.

విజయవాడలోని గ్రీన్ పోలింగ్ స్టేషన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, పలువురు ఉన్నతాధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు.

మాక్ పోల్ తర్వాత రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు సీఈవో కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో పట్టిష్టమైన పోలీసు భద్రత మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ, నైపుణ్యం గల బీఈఎల్ ఇంజనీర్ల సహకారంతో సెక్టార్ అధికారులు రిజర్వులో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications