కోనసీమ నేతలతో సీఎం జగన్ భేటీ - కీలక నిర్ణయం..!!
కోనసీమ ప్రాంతానికి చెందిన నేతలు - సామాజిక వర్గాల నాయకులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నదమ్ముల్లా అంతా కలసిమెలసి జీవిస్తూ ఒక్కటవుదామని సీఎం పిలుపునిచ్చారు. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా మునుపటిలా కలిసి మెలిసి జీవించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదామని కోరారు. అందరినీ ఏకం చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐక్యంగా ఉంటామని కాపు- శెట్టి బలిజ నేతలు ప్రకటించారు.
కోనసీమ జిల్లా పేరు మార్పు పై అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతానికి చెందిన నేతలతో పాటుగా సామాజిక వర్గ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో అందరూ ఐక్యంగా జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించి ఐకమత్యాన్ని పెంపొందించే ప్రయత్నంగా పేర్కొన్నారు.
తరతరాలుగా అదే ప్రాంతంలో కలసిమెలసి జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారన్నారు. రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి అందరూ కలిసి మెలిసి జీవించాలని సూచించారు. లేదంటే భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.

జరిగిన అంశాలను లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనివల్ల నష్టపోయేది మనమేనని, అందుకే అందరం కలిసి ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆప్యాయతతో ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు.., అపోహలున్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందామని సూచించారు. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా కలిసిపోదామంటూ ఆహ్వానించారు. ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. లంచాలకు తావులేని మంచి వ్యవస్ధను తీసుకొచ్చామని వివరించారు. పార్టీలను చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి వ్యవస్థ ఉంటే సమాజానికి మంచి జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.
నాడు జరిగిన ఘటనలు దురదృష్టకరమని..ఐక్యంగా ముందుకు సాగుతామని కోనసీమ నుంచి కాపు - శెట్టి బలిజ నేతలు హామీ ఇచ్చారు. సామరస్య వాతావరణం కోసం పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. యువకుల భవిష్యత్తు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తీసుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారని ఆ వర్గ నేతలు పేర్కొన్నారు. పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మరింత సాయం చేశారన్నారు. సమాజ శ్రేయస్సు నిర్ణయానికి కట్టుబడి శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాలు ఐకమత్యంగా ఉంటాయని రెండు వర్గాలకు చెందిన నేతలు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications