ఇక..100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష: జస్టిస్ శివశంకర్ రావుకు బాధ్యతలు: నోటిఫికేషన్ జారీ..!!
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల జారీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అంచనాకు వచ్చింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్..ఏపీలో ఇక నుండి ఏ రంగంలో అమలు చేసే టెండర్లు అయినా వంద కోట్లు దాటితే దానిని న్యాయమూర్తి సమీక్ష ద్వారా జ్యుడిషియల్ రివ్యూ తో ఖరారు చేయాలని నిర్ణయించారు. దీని కోసం గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదించారు. బిల్లు రూపకల్పనకు ముందే ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన ఉద్దేశాన్ని వివరించారు. హైకోర్టు జడ్జిని కేటాయించాలని అభ్యర్ధించారు. దీంతో..బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందటంతో హైకోర్టు న్యాయమూర్తి ఈ విధానం కోసం హైకోర్టు జడ్జి బి శివ శంకర్ రావును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం మేరకు జస్టిస్ శివ శంకర్ రావు ఛైర్మన్ గా ఏపీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఏ నిర్ణయం అయినా వంద కోట్లు ఖర్చు దాటితే ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ ద్వారా మాత్రమే టెండర్ ఖరారు చేస్తారు. ముందుగా టెండర్లు ఆహ్వానించి వాటిని జ్యుడిషియల్ కమిషన్ ముందు ఉంచుతారు. న్యాయమూర్తి తనకు ఉన్న సందేహాలను..అనుమానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ నుండి క్లియర్ చేసుకుంటారు. ఆ తరువాత 15 రోజుల పాటు పబ్లిక్ డొమైన్ లో ఈ నోటిఫికేషన్ ఉంచుతారు. దీని పైన ఎవరైనా సూచనలు చేసిన వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తరువాత కమిషన్ టెండర్ ఎవరికి కట్టబెట్టాలో నిర్ణయిస్తారు. కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే ప్రభుత్వం వారికి టెండర్ అప్పగిస్తుంది. తాజాగా పోలవరం విషయంలో ప్రభుత్వం హెడ్ వర్క్స్ విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లటంతో..ఇప్పుడు ఈ కమిషన్ ముందుకు ఆ టెండర్ కు సంబంధించిన టెండర్లు తొలి అంశంగా రానుంది. ప్రభుత్వం ఇరిగేషన్..మౌళిక వసతులు.. పరిశ్రమలు..పెట్టుబడులు.. ప్రభుత్వ వర్క్స్ విషయంలో ఈ కమిషన్ నిర్ణయం మేరకు నడుచుకోనుంది. ఇక, ఈ కమిషన్ కోసం నియమించిన హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివ శంకర్ రావు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications