మణిపూర్ విద్యార్ధుల తరలింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
మణిపూర్ లో ఏపీకి చెందిన విద్యార్ధులకు అండగా నిలుస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితుల్లో అక్కడి విద్యార్ధులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. అక్కడి విద్యార్ధులకు అందించాల్సిన సాయం పైన అధికారులకు సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని మంత్రి బొత్సా వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడున్న ఏపీ విద్యార్థులతో కూడా ప్రభుత్వ తరఫున మాట్లాడామని బొత్సా చెప్పుకొచ్చారు.
స్వస్థలాలకు రప్పించేందుకు: మణిపూర్ లో ఉన్న విద్యార్ధులను స్వస్థలాలకు రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెండు విమానాలు సిద్దం చేసింది. ఒకటి హైదరాబాద్, రెండోది కోల్ కతాకు ఏర్పాటు చేసారు. అక్కడ నుంచి వారిని ప్రత్యేకంగా ఏర్పాట్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నారు. దాదాపు వంద మంది విద్యార్ధులను రప్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మణిపూర్ లో ఉన్న విద్యార్ధులను తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి బొత్సా వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సంప్రదించడం, వారి వివరాలన్నింటినీ సేకరించడంతో పాటు వారిని ఇక్కడకు రప్పించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్ధులను ఒకచోటికి చేర్చేందుకు అక్కడ కోఆర్డినేటర్లను పెట్టి ఒక క్వార్టర్లో ఉంచుతున్నామని వివరించారు.

యంత్రాంగం సంప్రదింపులు: సివిల్ ఏవియేషన్ అధికారులతో కూడా ఏపీ భవన్ అధికార యంత్రాంగం సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. వారందర్నీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు గానీ, విజయవాడకు గానీ రప్పించి.. ఆ తర్వాత వారి వారి స్వస్థలాలకు విద్యార్థులను పంపుతామని బొత్సా వెల్లడించారు.ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురవకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అన్నివిధాలుగా అండగా నిలబడి ఆంధ్రాకు తెస్తామని మంత్రి బొత్సా హామీ ఇచ్చారు. ప్రభుత్వం పట్టించుకోలేదనే కొన్ని పచ్చ పత్రికల కథనాల్ని ఎవరూ నమ్మనవసరంలేదన్నారు. మణిపూర్లో ఉన్న విద్యార్థులతో కొందరితో స్వయంగా తానే మాట్లాడానని బొత్సా చెప్పుకొచ్చారు.

రెండు విమానాల ఏర్పాటు: వారు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్నానన్నారు. హెల్ప్లైన్ నెంబర్ను వారికి చెప్పి.. అక్కడ వారికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 150 మందికి సరిపడా ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని బట్టి అదనంగా ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారాలన్నీ సీనియర్ ఐఏఎస్ అధికారి దాస్ గారి నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్లు పర్యవేక్షిస్తున్నారుని మంత్రి బొత్సా వివరించారు.












Click it and Unblock the Notifications