జగన్ మూలాలపై లోకేష్ గురి - తాజా నిర్ణయంతో..!!
ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మూలాలను పూర్తిగా చెరిపివేసేలా కొత్త అడుగులు వేస్తోంది. విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు..తీసుకున్న నిర్ణయాల ను జగన్ తన మార్క్ పాలనగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వీటి పైన లోకేష్ గురి పెట్టారు. నాట పథకాల పేర్లను పూర్తిగా మార్పు చేసారు. అమలులోనూ మార్పులు చేస్తున్నారు. పథకాలకు ఖరారు చేసిన కొత్త పేర్లను లోకేష్ వెల్లడించారు.
పథకాల పేర్లను మార్పు
ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్పు చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే..పేర్లలో మార్పులు చేస్తూ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేసారు.

డొక్కా సీతమ్మ పేరు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని గతంలో అభిప్రాయపడ్డారు. దీంతో, కొన్ని క్యాంటీన్లకు ఈ పేరు పెడతారనే చర్చ జరిగింది. కానీ, ఇప్పటి వరకు జగనన్న గోరుమద్దుగా అమలు చేసిన పథకానికి డొక్కా సీతమ్మ మధ్నాహ్న బడి భోజనంగా మార్చారు. అదే విధంగా.. మన బడి - నాడు నేడును మన బడి - మన భవిష్యత్తు అని, స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష అని, జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని మారుస్తున్నట్లు ఎక్స్లో వివరించారు.
రాజకీయాలకు అతీతంగా
గత ఐదేళ్లలో భ్రష్టుపట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం అప్పటి సీఎం పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామన్నారు. విద్యా రంగంలో విశేష సేవలు అందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెట్టామన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు తెలిపారు.వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు.












Click it and Unblock the Notifications