జగన్ సర్కార్ అప్పుల చిట్టా ఇదే .. వివిధ బ్యాంకుల్లో ఏపీ అప్పులపై కేంద్రం షాకింగ్ లెక్కలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా లెక్కకుమించి ఏపీ రాష్ట్రానికి అప్పులే కనిపిస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని దారుణమైన స్థితిలో ఏపీ ఉందంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారినదో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఉద్యోగుల జీతాలకు అప్పులు తెచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం సాధారణ ఖర్చులకు కూడా అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఏపీ ఆర్థిక పరిస్థితి జగన్ సర్కారు హయాంలో పూర్తిగా దిగజారిపోయింది అన్ని ప్రతిపక్ష పార్టీలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కేంద్రం కూడా ఏపీ అప్పులపై పిడుగు లాంటి వార్త చెప్పింది.
వైసీపీ పాలనకు వన్ టైమ్ సెటిల్మెంట్; వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలిపోబోతున్నారా..?
పది జాతీయ బ్యాంకుల నుండి 57,479 కోట్ల రూపాయలు ఏపీ అప్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి 57,479 కోట్ల రూపాయలు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కరాడ్ సమాధానమిచ్చారు. ఏపీ లోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని ఆయన పేర్కొన్నారు.
2019 సంవత్సరం నుండి 2021 నవంబర్ వరకు జాతీయ బ్యాంకులు ఇచ్చిన అప్పుల చిట్టా ఇదే
2019 సంవత్సరం నుండి 2021 నవంబర్ వరకు జాతీయ బ్యాంకులు ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వరంగ కార్పొరేషన్లు, కంపెనీలకు ఇచ్చిన రుణాల చిట్టాను ఆయన పేర్కొన్నారు. ఏ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసిందో చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి తొమ్మిది సంస్థలు 11,937 కోట్ల రూపాయల రుణం పొందాయని ఆయన వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐదు కంపెనీలు కార్పొరేషన్లకు 10,865 కోట్ల రూపాయలు కేటాయించారని స్పష్టం చేశారు.
రాజ్య సభలో స్పష్టం చేసిన కేంద్రమంత్రి
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలకు ఏడు వేల కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు 2970 కోట్ల రూపాయలు, అలాగే కెనరా బ్యాంకు నుంచి 4099 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 750 కోట్ల రూపాయలు, ఇండియన్ బ్యాంక్ నుంచి 5,500 కోట్ల రూపాయలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 1750 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,633 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ నుంచి 6,975 కోట్ల రూపాయలు ఏపీ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రుణం పొందినట్లుగా కేంద్రమంత్రి రాజ్య సభ వేదికగా స్పష్టం చేశారు.
సంక్షోభం దిశగా ఏపీ ఆర్ధిక పరిస్థితి
ఇప్పటికే గడిచిన ఎనిమిది నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు బడ్జెట్లో చూపించిన దాని కంటే 34 శాతం అదనంగా ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం చేసిన కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో స్పష్టంగా చెబుతుంది . ఏపీ ప్రస్తుతం సంక్షోభం దిశగా సాగుతుందని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏపీ అప్పులపై కాగ్ అక్షింతలు వేసిన విషయం తెలిసిందే.
Recommended Video
అప్పు లేనిదే రోజు గడవని స్థితిలో ఏపీ ఉందన్న కాగ్.. తాజాగా కేంద్రం కూడా
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందని భయం పెరుగుతోందని అవసరాల కోసం అప్పులు చేస్తున్నారని, ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని, అప్పుల వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేస్తున్నారని అసలు అప్పు లేనిదే రోజు గడవడం లేదు అన్న విధంగా పరిస్థితి తయారవుతుందని కాగ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం ఇచ్చిన లెక్కలు, వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్ళ ముందు ఉంచాయి.