నిత్య విద్యార్ధి సీతక్క.. మరో కోర్సు ఎంట్రన్స్ రాసిన మంత్రి!
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క చదువుపై తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. వయస్సుతో గానీ, అనుభవిస్తున్న ఉన్నత అధికార హోదాతో గానీ సంబంధం లేకుండా నిరంతర విద్యార్థిగా సాగవచ్చని ఆమె నిరూపించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ పీజీఎల్సెట్ ప్రవేశ పరీక్షకు ఆమె స్వయంగా హాజరయ్యారు.
కాన్స్టిట్యూషనల్ లా కోర్సు కోసం ఎంట్రన్స్ రాసిన మంత్రి సీతక్క
హైదరాబాద్ మౌలాలీలోని ఒక పరీక్షా కేంద్రంలో ఆమె ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షను రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 'కాన్స్టిట్యూషనల్ లా' రాజ్యాంగ చట్టం విభాగంలో ఎల్ఎల్ఎమ్ కోర్సును చేయటం కోసం సీతక్క ఈ పరీక్ష రాశారు. సాధారణంగా రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు, అందులోనూ మూడు శాఖలు నిర్వహిస్తున్న సీతక్క చదువువిషయంలో చూపించే శ్రద్ధ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

గతంలోనే ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేసిన మంత్రి సీతక్క
గతంలోనే ఆమె ఉన్నత విద్యాభ్యాసాలను విజయవంతంగా పూర్తి చేశారు. న్యాయశాస్త్రంపై పట్టు సాధించేందుకు 2001 లోనే ఆమె న్యాయశాస్త్రంలో ఎల్ఎల్ బీ పట్టా అందుకున్నారు. గతంలోనే ఆమె 'కార్పొరేట్ లా' విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (LLM) పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ (రాజకీయ శాస్త్రం) విభాగంలో పీహెచ్. డీ డాక్టరేట్ సాధించారు.
మళ్ళీ కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలని ఎంట్రన్స్ రాసిన సీతక్క
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 'గొత్తి కోయ' గిరిజన తెగల సామాజిక మినహాయింపు, వలసలపై ఆమె చేసిన పరిశోధనా వ్యాసానికి గానూ ఈ పీహెచ్డీ లభించింది.రాజ్యాంగంపై ప్రత్యేక ఆసక్తి కారణంగా ఇప్పటికే ఎన్నో ఉన్నత డిగ్రీలు, డాక్టరేట్ ఉన్నప్పటికీ, ఆమె ఇప్పుడు 'కాన్స్టిట్యూషనల్ లా' లో మరో ఎల్ఎల్ఎమ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అడవి బాట నుండి జనంలోకి వచ్చిన సీతక్క ప్రస్తానం
చట్టాలపై మరింత లోతైన అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆమె భావిస్తున్నారు.1980వ దశకం చివరలో సీతక్క నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులై అడవి బాట పట్టారు. ఆ తర్వాత 1990లలో తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, 2009లో ములుగు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సీతక్క గొప్ప రోల్ మోడల్
అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2018, 2023 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గంలో కీలకమైన శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మంత్రి హోదాలో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, సామాన్య విద్యార్థిలా వచ్చి ప్రవేశ పరీక్ష రాయడం పట్ల సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. యువతకు, తోటి రాజకీయ నాయకులకు ఆమె ఒక గొప్ప రోల్ మోడల్గా నిలిచారు.













Click it and Unblock the Notifications