ముహూర్తం ఫిక్స్: కేబినెట్..అదే రోజు ప్రత్యేక అసెంబ్లీ మీట్: రాజధానులపై అధికారిక ఆమోదం..!
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోదం దిశగా ముఖ్యమంత్రి జగన వేగంగా అడుగులు వేస్తున్నారు. మరింత కాలయాపన చేయకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెలలోనే మొత్తం అధికారిక ఆమోద ప్రక్రియ పూర్తి చేసేలా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ..బోస్టన్ నివేదికలు అందటంతో..ఇక ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ పని ప్రారంభించనుంది. ఈ నెల 6న తొలి భేటీ కానున్న కమటీ..ఈ నెల 17న సీఎం కు నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే ఒకే రోజు కేబినెట్ ఆమోదం..ఆ వెంటనే ఉమ్మడి అసెంబ్లీ సమావేశం..మూడు రాజధానులకు అధికారిక ఆమోదం..ఇలా.. చకా చకా ముందుకు వెళ్లేలా ముహూర్తాలు ఖరారు చేసారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసి విశాఖ నుండి పాలన ప్రారంభించే దిశగా కార్యాచరణ మలు చేస్తున్నారు.
ఒకే రోజు కేబినెట్.. అసెంబ్లీ సమావేశం
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజున ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా చెప్పిన మూడు రాజధానుల వ్యవహారానికి..తిరిగి అదే అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు నివేదికలు అందించటంతో...ఇక, కీలకమైన హైపవర్ కమిటీ ఈ రెండు నివేదికల పైనా అధ్యయనం చేయనుంది. ఈ నెల 6వ తేదీ నుండి ఈ కమిటీ వరుసగా భేటీ కానుంది. ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ మేరకు ఈ నెల 17వ తేదీన కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించనుంది. ఆ మరుసటి రోజే అంటే జనవరి 18న ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై..హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు.
ఉమ్మడి అసెంబ్లీ సమావేశంలోనే..
ఈ నెల 17న ముఖ్యమంత్రికి హైపవర్ కమిటీ నివేదిక అందించనుంది. ఆ మరుసటి రోజు 18న ఉదయం 7 గంటలకే ప్రత్యేకంగా ఇదే అంశం అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే అదే రోజు జనవరి 18న ఉదయం 9 గంటలకు శాసనసభ..మండలి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ ఉమ్మడి సమావేశాల్లో ఈ రాజధానుల ప్రతిపాదన పైన తీర్మానం ప్రవేశ పెడతారు. అధికార పార్టీ నుండి మూడు ప్రాంతాలకు చెందిన నేతలు ప్రభుత్వ తీర్మానం సమర్దిస్తూ మాట్లాడేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇతర పార్టీల నుండి అభిప్రాయాలు సేకరించి..ఆ సాయంత్రానికే అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోదించే విధంగా ప్రభుత్వం వ్యూహం సిద్దం చేస్తోంది.
ఇక..అంతా లాంఛనమే..
ముఖ్యమంత్రి సభలో సూచన ప్రాయంగా చేసిన మూడు రాజధానుల అంశం కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే నివేదికలు సమర్పించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ సైతం విశాఖలో పరిపాలనా రాజధాని కి సిఫార్సులు చేసాయి. ఇక, హైపవర్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా..రెండు కమిటీల నివేదికలను క్రోడీకరించిన నివేదిక ఇవ్వటం మినహా..అందుకు భిన్నంగా ప్రతిపాదనలు చేసే అవకాశం లేదు. దీంతో.. ఇక, హైపవర్ కమిటీ నివేదిక..కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర..అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ఇవన్నీ లాంఛనంగానే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా విశాఖ నుండి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక..అక్కడ పాలన ఎప్పుటి నుండి అధికారికంగా మొదలవుతుందీ...అమరావతి రైతులను శాంతింప చేసేందుకు ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తి కర అంశం.