టెన్త్ విద్యార్ధుల కోసం - ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం : అలా పాసైనా రెగ్యులరే..!!
పదో తరగతి విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేక విద్యార్ధులకు ఉపశమనం కలిగించేలా చర్యలు ప్రారంభించింది. తదుపరి చదువులకు ఆటంకం లేకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించింది. అదే సమయంలో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022-ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

రెగ్యులర్ పాస్ ..వారితో సమానంగా
సాధారణంగా సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్గానే పరిగణిస్తుంటారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే 'కంపార్టుమెంటల్ పాస్'ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ విమర్శలకు.. చర్చలకు కారణమయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు.. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు.

మార్కుల ఆధారంగా క్లాసుల ప్రకటన
వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్క్లాస్, సెకండ్క్లాస్, థర్డ్క్లాస్లుగా డివిజన్లను ప్రకటిస్తారు. గ్రేస్ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చలు సాగుతున్నాయి. పదివరకు గ్రేస్ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముందని.. దీని ద్వారా ఫెయిలయిన అందరు విద్యార్ధులకు ప్రయోజనం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం టెన్త్ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చారు.

గ్రేసు మార్కుల కంటే మేలు చేసేలా
విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లుగా సర్టిఫికెట్లు ఇస్తుండటంతో...అది విద్యార్ధులకు ప్రయోజన కరంగా ఉంటుంది. ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది. రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications