బ్రాండెడ్ మద్యం ధరలు, లైసెన్సు ఫీజులు ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. కొత్త మద్యం విధానంలో భాగంగా రూ 99 కే క్వార్టర్ అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. అదే సమయంలో బ్రాండెడ్ మద్యం ను తిరిగి రాష్ట్రంలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇక..ప్రయివేటు వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం లైసెన్సు ఫీజులను ఖరారు చేసింది. అక్టోబర్ తొలి వారి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది.
నూతన పాలసీ
నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మద్యం ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది, దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% అంటే 340 దుకాణాల కేటాయింపు. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది.

క్వార్టర్ రూ 99
ఇదే సమయంలో చీప్ లిక్కర్ క్వార్టర్ సీసా ధరలు తెలంగాణలో రూ.140, కర్ణాటకలో రూ.80, తమిళనాడులో రూ.90, ఒడిశాలో రూ.90గా ఉన్నందున వాటి సగటును పరిగణనలోకి తీసుకుని ఏపీలో క్వార్టర్ రూ.99గా ఉండాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి, వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్ బ్రాండ్లను ప్రవేశపెట్టనుంది. సాధారణ లిక్కర్ షాపులతో పాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్ షాపులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎలైట్ షాపుల ప్రారంభానికి అనుమతివ్వనుంది.

నోటిఫికేషన్ల జారీతో
తిరుపతిలో మాత్రం ఈ షాపునకు అనుమతి ఇవ్వరు. అలాగే లైసెన్సీలు వారి షాపుల పక్కన వాక్ ఇన్ స్టోర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం లైసెన్సీలు అదనంగా రూ.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. డ్రాట్ బీరు తయారు చేసి, విక్రయించే మైక్రో బ్రూవరీలకు మళ్లీ అనుమతివ్వనున్నారు. మైక్రో బ్రూవరీల్లో అప్పటికప్పుడు బీరును తయారుచేసి విక్రయిస్తారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసుకునే వారు బార్తో సమానంగా లైసెన్సు ఫీజు చెల్లించాలి. తొలుత 3,396 షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత గీత కార్మికుల కోసం అందులో 10శాతం అంటే 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

లైసెన్సు ఫీజులు
షాపుల లైసెన్సు ఫీజులను భారీగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన కనీసం రూ.50లక్షల నుంచి రూ.85లక్షల వరకు ఫీజులు పెట్టనుంది. ఎలైట్ షాపుల లైసెన్స్ ఫీజు రూ.కోటిగా ఉండనుంది. అయితే వీటికి కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఏటా 10శాతం లైసెన్స్ ఫీజు పెంచుతారు. షాపుల దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి మద్యం కంపెనీ కనీసం ఒక బ్రాండ్ను తక్కువ ధరతో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం మరో నిబంధన పెట్టనుంది.












Click it and Unblock the Notifications