ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ - కొత్త జిల్లాల నేపథ్యంలో : జనాభా ఆధారంగా విభజన..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు కొనసాగుతోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. మార్చి 10 తరువా తుది నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు పైన అధికారులు పలు ప్రతిపాదనలు సిద్దం చేసారు. జనాభా.. సంస్థల ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలని ప్రతిపాదించారు. జిల్లా స్థాయిలో ఉన్న వారికి మాత్రమే 'ఆర్డర్ టు సర్వ్' (ప్రొవిజినల్ కేటాయింపు) కింద కొత్త జిల్లాలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధిపతులకు సూచిస్తోంది.

ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే
గ్రామ, మండల స్థాయి ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. కేడర్ల వారీగా పోస్టులు తక్కువగా ఉంటే..కింది పోస్టులను ఉన్నతీకరించి ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ రెండు విడతలుగా వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఎలా జరగాలన్న దానిపై వివరించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 70వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులు, లక్ష మంది వరకు పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు.

ఆర్డర్ టు సర్వ్
వీరిలో జిల్లాల వారీగా ఉన్న పోస్టులు ఎన్ని.. మంజూరు చేసినవి ఎన్ని.. అనే లెక్కలు సేకరించారు. ప్రభుత్వ ప్రతిపాదిత మార్గదర్శకాల పైన అధికారుల నుంచి సూచనలు కోరారు. కొత్త జిల్లాల్లో కొత్తగా ఉద్యోగ నియామకాలు ఉండవని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసారు. కొత్త జిల్లాలకు తగినట్లుగా ఆమోదం తెచ్చేందుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఆమోదంతో మార్పులు చేసేలోగా.. ఉద్యోగులను అవసరమైన ప్రాంతానికి తాత్కాలిక పద్ధతిలో 'ఆర్డర్ టు సర్వ్' కింద సర్దుబాటు చేస్తారు. దీనివల్ల కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ...కార్యకలాపాలకు అవరోధం లేదని అధికారులు చెబుతున్నారు.
Recommended Video

28వ తేదీ లోగా అప్ లోడ్
విద్య, వైద్య ఆరోగ్య శాఖలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతుండటంతో వీటిని కొనసాగించాలా.. వద్దా.. అన్న దానిపై చర్చిస్తున్నారు. వాస్తవానికి ప్రాంతీయ కార్యాలయాలు అవసరంలేదని గతంలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 28వ తేదీలోగా ప్రభుత్వ వెబ్సైట్లో మంజూరైన పోస్టులు, భర్తీ అయిన పోస్టులు, ఇతర వివరాలను అప్లోడు చేయాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది.












Click it and Unblock the Notifications