రైతుల్లో ఖాతాల్లో రూ 20 వేలు, ముహూర్తం ప్రకటించిన చంద్రబాబు - వీరికి వర్తింపు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో రైతులకు ఇచ్చిన హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ నిధుల తొలి విడత జమ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. ఈ మేరకు చంద్రబాబు కీలక అంశాలను వెల్లడించారు. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఈ పథకం అమలు మార్గదర్శకాల పైన తుది కసరత్తు జరుగుతోంది.
తొలి విడత నిధులు
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది. ఈ సమయంలో ఎన్నికల హామీల అమలు పైన వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ అమలు పైన కీలక నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నెల 20న తొలి విడత నిధులు విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభు త్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి.

ఈ నెల 20న ముహూర్తం
ఇక, పీఎం కిసాన్ 20వ విడతకు సంబధించిన నిధులను ఈ నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధమైంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హత కలిగిన రైతుల వివరాల పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. ఇదే సమయంలో నిధుల జమ కు ముందే రైతులకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదే విధంగా బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో అనుసంధానించాలి. మూడోది భూమి రికార్డుల వివరాలను ధృవీకరించాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది.
వీరికి అప్పుడే
కౌలు రైతులకు అప్పుడే అదే విధంగా అటవీ భూములకు పట్టాలు పొందిన రైతులకు ఈ సాయం అందనుంది. ఇక, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో కొందరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. పంటకాలం మొదలైన తరువాత వారిని గుర్తించి, జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. తరువాత వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వారితో పాటుగా ఆర్దిక సాయం అందించనుంది. ఇక, ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కేటాయించారు. దీంతో, ఈ నెల 20న అర్హత ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications