ఏపీలో వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్యకు బిగ్ షాక్..!!
అమరావతి: మచ్ అవైటెడ్ మూవీస్ వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల యూనిట్స్ ప్రీ రిలీజ్ వేడుకలను వైభవంగా జరుపుకోవడానికి సన్నద్ధమౌతోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
జీవో నంబర్ 1..
ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుమతిని నిరాకరించింది. మంగళవారమే జారీ చేసిన జీవో 1ని ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వర్తింపజేసింది. తొక్కిసలాట చోటు చేసుకోకూడదనే కారణంతో హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీవో 1 ఆధారంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లను నిర్వహించడానికి అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. నిజానికి- షెడ్యూల్ ప్రకారం.. వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్లుండి ఒంగోలులో నిర్వహించాల్సి ఉంది.
8న విశాఖలో ప్లాన్ చేసినా..
ఇక వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించాలని చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. తాజాగా ప్రభుత్వం అనుమతులను నిరాకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు బాలకృష్ణ గానీ, ఇటు చిరంజీవి గానీ ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేర్వేరు వేదికల మీద వ్యాఖ్యానాలను గుప్పిస్తోండటం.. అదే సమయంలో వారిద్దరూ నటించిన భారీ బడ్జెట్ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లకు బ్రేక్ వేయడం చర్చనీయాంశమౌతోంది.
అన్ స్టాపబుల్ ఎఫెక్ట్..?
ఇటీవలే- అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సెకెండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నందమూరి బాలకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి- మాజీమంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేశారు. అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఈ వేదిక మీదికి పిలిపించారు.
తమ్ముడికి అండగా అన్న..
అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను సమర్థిస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ ను చాలామంది చాలా రకాలుగా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు మొన్నీ మధ్యే. ఏదో ఒకరోజు తన తమ్ముడు రాష్ట్రంలో అత్యున్నత స్థితికి చేరుకుంటాడని, ప్రజలు ఆయనను ఆశీర్వదిస్తారంటూ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ వాదన వేరే..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరుల్లో నిర్వభించిన సభల్లో సంభవించిన తొక్కిసలాట, ఆ ఘటనల్లో 11 మంది మరణించిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1ను జారీ చేసింది. దీనికి లోబడే వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేస్తోంది.