పీఆర్సీ ఆమోదయోగ్యం కాదు - యథాతథంగా కొనసాగించాలి : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం..!!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ వ్యవహారం ఇంకా ముగిసినట్లు కనిపించటం లేదు. గత వారం ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షలో పీఆర్సీ ప్రకటించారు. 23 శాతం ఫిట్ మెంట్ తో పాటుగా పలు నిర్ణయాలు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేసారు.

సీఎం నిర్ణయాలై వ్యతిరేకత
సీఎం ప్రతిపాదనలను అంగీకరించారు. ఆ తరువాత కొన్ని ఉపాధ్యాయ సంఘాలు..ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాల పైన వ్యతిరేకించటం మొదలు పెట్టాయి. తాజాగా...ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పీఆర్సీని వ్యతరేకించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. లు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని ఆ సంఘ నేతలు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కొత్త డిమాండ్లు
2010లోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని పొరుగు రాష్ట్రంలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని సీఎస్ కు ఇచ్చిన లేఖలో పేర్కొంది. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది. వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినట్టుగా ఇంటి అద్దెభత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు కొనసాగించాలని కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.
Recommended Video

అవి ఆమోదయోగ్యం కాదంటూ లేఖ
70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని ఆ సంఘ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లో ఉన్న 5 డీఏలను తక్షణం చెల్లించాలని కోరింది. తక్షణం సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఏపీ జీఈఏ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణం ప్రోబెషన్ డిక్లేర్ చేయాలని సీఎస్ కు రాసిన లేఖలో కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. 1993 నుంచి పని చేస్తున్న 5 వేల మంది కంటింజెంట్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించాలని కోరింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సీఎస్ కు ఇచ్చిన లేఖలో పేర్కొంది. అయితే, ప్రభుత్వం దీని పైన మరోసారి పునరాలోచన చేస్తుందా అనేది ఇప్పుడు సందేహంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications