ఏపీలో పేదల ఇళ్ల స్ధలాల్లో నిర్మాణాల కోసం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్లు.. నెవర్ బిఫోర్..
ఏపీలో పేదలకు ఉగాదికి ఇవ్వబోతున్న ఇళ్ల స్ధలాల్లో నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన కింద అన్ని రకాల మినహాయింపులను ఇచ్చి ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ నాలుగు జీవోలను జారీ చేసింది.
ఏపీలో పేదలకు మరిన్ని వరాలు
ఏపీలో ఉగాది నాటికి 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరికొన్ని వరాలు ప్రకటించింది. ఇళ్ల స్ధలాలు తీసుకున్న పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ ఏపీ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఉగాది నాటికి ఇళ్ల స్దలాలు తీసుకునే పేదలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బీపీఎల్ కుటుంబాలకూ దీన్ని వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎమ్మార్వో ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు
ఉగాదికి ఇళ్ల స్ధలాలు తీసుకునే పేదలతో పాటు గతంలో ఇళ్ల స్ధలాలు తీసుకున్న పేదలకూ ఇళ్ల నిర్మాణాల కోసం అన్ని ఫీజులు మినహాయించారు. అదే సమయంలో ఇళ్ల స్ధలాల ఉచిత రిజిస్టేషన్ల కోసం వచ్చే వారికి వెలుసుబాటు కల్పించేందుకు వీలుగా ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ రిజిస్టార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. దీంతో గ్రామాలతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న పేదలకు రిజిస్టార్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
Recommended Video
ఇళ్ల స్ధలాలను తాకట్టు, అమ్ముకునే వెసులుబాటు
పేదలకు ఇవ్వబోతున్న ఇళ్ల స్ధలాలపై రుణాలు పొందేందుకు, వాటిని తాకట్టు పెట్టుకునేందుకు, ఐదేళ్ల తర్వాత నేరుగా అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇక పేదల ఇళ్ల స్ధలాలు, వాటిలో నిర్మాణాల వ్యవహారం మరింత సులభతరం కానుంది.