ఏపీ ప్రభుత్వ సలహాదారుడి పైన వేటు!! మరో కీలక పోస్టు అప్పగింత: త్వరలో అధికారిక ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న ఒక ముఖ్యమైన అధికారిని తప్పిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల కాలంలోనే ఆయన పైన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన తక్కువ సమయంలోనే కీలకంగా మారారు. అదే సమయంలో ఆయన ఇచ్చిన సలహాలే ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయనే అభిప్రాయం నెలకొంది. దీంతో ఆయనను సలహాదారుడి పోస్టు నుండి తప్పించి మరో కీలక స్థానం అప్పగిస్తారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న సీనియర్ ఐఏయస్ రాజీనామా చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పటికిప్పుడు తప్పిస్తే వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
కీలక సలహాదారుడి పైన వేటు...!!
ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయం. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన వేళ ఒక సలహాదారుడి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వటంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ సలహాదారుడిని తప్పించి..మరో స్థానంలో నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి రోజుల్లోనే వివాదాస్పద నిర్ణయాలతో విమర్శలు వెల్లెవెత్తాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష విషయంలో ఆ సలహాదారుడు అత్యుత్సాహం కారణంగానే సమస్యలు వచ్చాయనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అదే విధంగా ప్రభుత్వం తీసుకున్న మరి కొన్ని నిర్ణయాల విషయంలోనూ ఆయన సరిగ్గా వ్యవహరించలేదనే వాదన వినిపిస్తోంది. ఇక, రాజధాని విషయంలోనూ ఆ సలహాదారుడు చేసిన సూచనలు పైన ప్రభుత్వంలోని మంత్రులే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, ప్రధాని కార్యాలయంలో సైతం పీపీఏల సమీక్ష పైన అక్కడి అధికారులు వివరణ కోరగా..వారికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వటంలో ఆయన తడబడ్డారని..ఫలితంగా ప్రభుత్వం వద్ద సమర్ధమైన వాదన లేదనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ సలహాదారుడిని తప్పించి..మరో స్థానంలో నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సలహాదారుడికి కొత్త పోస్టులో అవకాశం...
ప్రభుత్వం తప్పించాలని నిర్ణయించిన ఆ సలహాదారుడికి ప్రాధాన్యత తగ్గకుండా మరో కీలక పోస్టులో నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలకమైన విజిలెన్స్ కమిషనర్ గా ఆయన్ను నియమించనున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్ గా పని చేసిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ప్రభుత్వంలోకి కొందరు పెద్దలు వారించినా తన పదవికి సడన్ గా రాజీనామా చేసారు. ఆ పదవి ఇప్పుడు సలహాదారుడిగా తప్పిస్తున్న వ్యక్తికి కట్టబెట్టనున్నారు. సలహాదారుడి తీరు పైన ప్రభుత్వంలోని అధికార యంత్రాంగాన్ని పర్యవేక్షించే అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారని.. కొందరు మంత్రులు సైతం ఫిర్యాదులు చేసారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని కీలక పధకాల రూపకల్పన విషయంలోనూ ఆ సలహాదారుడు కీలకంగా వ్యవహరించారు. దీని కారణంగానే మరి కొంత కాలం ఆయనను కొనసాగించాలనే ఆలోచన ఉన్నా..తన మీద నెలకొన్న అభిప్రాయాల కారణంగా ఆయనే తనను తప్పించాలని కోరినట్లు గా తెలుస్తోంది. దీంతో..త్వరలోనే ఆయనను సలహాదారుడి పదవి నుండి తప్పించి విజిలెన్స్ కమిషనర్ గా నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications