జగన్ మార్క్ మాయం - సచివాలయాలకు తాజా ఆదేశాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ మార్క్ లేకుండా అడుగులు వేస్తోంది. పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన చంద్రబాబు ఫోకస్ చేసారు. జగన్ తన మార్క్ పథకాలు గా ప్రచారం చేసుకున్న వాటి పేర్లను వరుసగా మార్చుతోంది. కొత్త పేర్లను ఖరారు చేసింది. అదే సమయంలో వార్డు, గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రభుత్వ నిర్ణయాలు
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత తమ మార్క్ చూపించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే చంద్రబాబు తన వైఖరి ఎలా ఉండేదీ స్పష్టత ఇచ్చారు. జగన్ పాలనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టారు. తన టీం కూర్పు పైన కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు లేదా రేపు రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరగనున్నాయి. కొత్త అసెంబ్లీ కొలువు తీరుతోంది. జగన్ తన పాలనలో తనకు మాత్రమే సాధ్యం అని చెప్పుకున్న పథకాల విషయంలో ప్రభుత్వ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది.

పేర్లు మార్పు
చంద్రబాబు ప్రభుత్వం ఆరు ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు...ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేస్తూ ఉత్తర్వులివ్వగా... తాజాగా సాంఘిక సంక్షేమశాఖ అధ్వర్యంలో నడిచే ఆరు ప్రభుత్వ పథకాల పేర్లు మార్చా రు. ప్రజాభీష్టం మేరకే ఈ పేర్లు మార్చుతున్నట్లుగా స్పష్టంచేశారు. వాటిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేర్లు మారాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీలు)కు బదులుగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏఓవీఎన్), వైఎస్ఆర్ కల్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు.
సచివాలయాలకు ఆదేశాలు
వైఎస్ఆర్ విద్యోన్నతికి ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం (జేసీఎస్పీ)కి సివిల్ సర్వీస్ పరీక్షా ప్రోత్సాహకాలుగా పేర్లు మార్చుతూ ఆదేశాలు జారీజేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాల పేర్లు మార్చే అవకాశాలున్నాయి. ఇక, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటిపై ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులిచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications