నిరుద్యోగులకు శుభవార్త...ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
అమరావతి: నిరుద్యోగులకు శుభవార్త...ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం జీవో 182ను జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది.
ఈ వయోపరిమితి పెంపు 2018 సెప్టెంబర్ వరకు వర్తిస్తుందని ఈ జీవో లో పేర్కొంది. 2014లో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా దాన్ని 42 ఏళ్లకు పెంచుతూ, 2016 వరకు వర్తించేలా ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016లో దీన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు.
అయితే, కొన్ని నోటిఫికేషన్ల విడుదల ఆలస్యం కావడంతో వయోపరిమితి పెంపు తమకు ఉపయోగపడింది తక్కువేనని నిరుద్యోగులు సిఎం కి తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు తాజాగా మరోసారి వయోపరిమితిని 2018 సెప్టెంబరు 30 వరకు దీనిని పొడిగించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ఈ నియమం వర్తిస్తుందని జీవో 182లో పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.