కేంద్రం వెనుకడుగు, సీఎం జగన్ ముందుకే - అమరావతిపై తాజా ఉత్తర్వులు..!!
అమరావతి విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అమరావతిలో పేదలకు ఇంటి నిర్మాణాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిధిలో ఏపీ ప్రభుత్వం తాజాగా 47,017 మందికి ఇంటి స్థలాలను కేటాయించింది. ఇంటి నిర్మాణాలకు నిర్ణయించింది. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండటంతో కేంద్రం ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ పై మెలిక పెట్టింది. సీఎం జగన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు:అమరావతిలో ఇంటి నిర్మాణాల వ్యవహారం న్యాయ వివాదంగా మారింది. ఏపీ ప్రభుత్వం మాత్రం రాజధానిలో అందరికీ ఇళ్లు ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. అమరావతి పేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేసారు. సీఎం జగన్ ఇంటి పట్టాలను పంపిణీ చేసారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసారు. ఈ సమయంలోనే రాజధానిలో ఇంటి నిర్మాణాల పైన తుది తీర్పు కు లోబడి వ్యవహరించాలని న్యాయస్థానం పేర్కొంది. దీంతో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు స్పష్టతనిచ్చే వరకు ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ముందుకే వెళ్లాలని డిసైడ్ అయింది.

ఏపీ ప్రభుత్వమే భరించేలా:కేంద్రం ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ విషయంలో వెనుకడుగు వేయటంతో ఏపీ ప్రభుత్వమే ఆ భారం మోసేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం వాటాను తామే భరిస్తామంటూ తాజా జీవో జారీ చేసింది. ఇంటి నిర్మాణాల కోసం దాదాపు రూ.916 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అమరావతి కొందరిదే కాదు..అందరిదీ అనేది వైసీపీ ప్రభుత్వం బలంగా వినిపిస్తున్న వాదన.
అమరావతిలో పేదలకు ఇంటి నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇక్కడ ఇంటి పట్టాలు పంపిణీ చేసారు. దీనిని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. దీని పైన న్యాయ స్థానాలను ఆశ్రయించింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల కారణంగా కేంద్ర సబ్సిడీ పైన మెలిక పెట్టింది. ముఖ్యమంత్రి జగన్ ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్దమయ్యారు.
సీఎం జగన్ ముందుకే:రాజధాని ప్రాంతంలో కేటాయించిన 47,017 ఇళ్ల స్థలాల్లో మంగళగిరి నియోజకవర్గం పరిధిలో 19,397, విజయవాడ సెంట్రల్లో 8,504 ఇళ్లు, విజయవాడ ఈస్ట్లో 7,963, విజయవాడ వెస్ట్లో 7,354, పొన్నూరులో 2050, తాడికొండ నియోజకవర్గంలో 1749 ఇళ్లు కేటాయించారు. యూనిట్ ధరను రూ.2.30 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వివాదంపై కోర్టు కేసు పూర్తవ్వని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా మొత్తం రాష్ట్రమే భరిస్తుందని పేర్కొంటూ జీవో ఇచ్చింది.
మొత్తం ఈ 47,017 ఇళ్లకు రూ.1081.39కోట్ల ఖర్చవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటి నిర్మాణాల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే అవకాశం కనపిస్తోంది. ఈ రోజు జరుగుతున్న మంత్రవర్గ సమావేశంలోనూ దీని పైన ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications