ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్ - ధరలు మార్పు, ఇక నుంచి..!!
ఏపీలో కొత్త మద్యం బ్రాండ్ల ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటుగా కొత్త బ్రాండ్లను అనుమతి కోసం ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీని పైన తాజాగా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త బ్రాండ్లు అవసరం లేదని ఆ ప్రతిపాదనలు తోసి పుచ్చినట్లు సమాచారం. అదే విధంగా బ్రాండ్ల ధరల సవరణ అంశం పైన చర్చించిన వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక.. ప్రస్తుతం అమల్లోకి రానున్న బార్ పాలసీ పైన అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.
ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి లభించ లేదు. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. వీటి పైన చర్చించిన తరువాత కొత్త బ్రాండ్లు అవసరం లేదని సీఎం తిరస్కరించినట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖ కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లలో చాలావరకూ సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లే ఉన్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ల పేర్లకు చిన్నపాటి మార్పులు చేసి కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి స్వల్ప మార్పులతో వచ్చినా వాటిని కొత్త బ్రాండ్లుగానే పరిగణిస్తారు. వాటికి కొత్త ధరలు నిర్ణయిస్తారు. ఇప్పుడు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లకు అనుమతిస్తే మళ్లీ గత ప్రభుత్వం చేసిన తప్పు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా, ఈ సారి అవే కంపెనీలు కొత్త పేర్లతో నాణ్యత తగ్గించి బ్రాండ్లను ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచుకోవాలని భావించాయి. అదే విధంగా కొన్ని పూర్తిగా కొత్త బ్రాండ్లు వచ్చేందుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త బ్రాండ్లు అక్కర్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశంకూడా కేబినెట్ ముందుకొచ్చింది. దీనిపై త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
టెండర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా వాటి ధరలను సవరించనున్నారు. ప్రస్తుత ధరల కంటే ఇంకా తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. దీంతో..ఈ అంశం పైన టెండర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి చేసే సిఫారసుకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications