ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు ఫిక్స్... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు ఫిక్స్ చేసింది. NABH(National Accreditation Board for Hospitals) అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రుల్లో నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) చికిత్స కోసం రోజుకు రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రూ.3600 వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆక్సిజన్ సపోర్ట్తో కూడిన కరోనా ట్రీట్మెంట్కు అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రోజుకు రూ.6,600, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రోజుకు రూ.5,850 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రులకు ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ.12 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.10,800 ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది.
క్రిటికల్ కేర్ చికిత్స (ఐసీయూ+వెంటిలేటర్) కోసం అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రూ.16 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.14,400 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇలా ధరలు ఫిక్స్ చేసింది.
కోవిడ్ చికిత్స పూర్తయినా రోగులను డిశ్చార్జి చేయని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చికిత్స పూర్తయినప్పటికీ మరో 10-14 రోజుల పాటు రోగులను ఉంచి కొన్ని ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదులు అందడంతో నోటీసులు జారీ చేసింది. రోజువారీ ట్రీట్మెంట్ విధానంలో ఆస్పత్రులకు చెల్లింపులు జరపాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఫారసు చేసినప్పటికీ కొన్ని ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్నాయన్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కోలుకున్న పేషెంట్లను వెంటనే డిశ్చార్జి చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం(ఏప్రిల్ 30) ఏపీలో కొత్తగా 17,354 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 64 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7992కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,63,90,360 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 8468 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 9,70,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.