టిడిపి మొదలెట్టేసింది: పధకాలకు నిదులు విడుదల : ఆ ఓట్లన్నీ సైకిల్ కేనా..!
ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం వరుసగా నిధులు విడుదల చేస్తోంది. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా వ్యవహ రించిన రాష్ట్ర ప్రభుత్వం పలు పధకాలతో లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు నుండి అమలు చేస్తున్న పధకాలు కావటంతో ఎన్నికల సంఘం నుండి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని భావించారు. ఇప్పికే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..ఈనెల 5న పసుపు-కుంకుమ పధకం నిధులను విడుదల చేయనుంది.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల..
ఏపి ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ' కింద నగదును రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మ కంగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో రూ.1000ను ప్రభుత్వం డిపాజిట్ చేసింది. తాజాగా మిగిలిన రూ.3,000ను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఏపీలోని 45 లక్షల మంది రైతులకు రూ.1,349.81 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఎకరాలలోపు ఉన్న సన్న,చిన్నకారు రైతులకు కేంద్రం సాయంతో కలిపి రూ.15,000, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.10,000 ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని లో భాగంగా.. ఈ రోజు ఈ పధకం కింద రైతులకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అయింది. దీని ద్వారా రైతుల నుండి తమ పార్టీకి సానుకూలత పెరుగుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తన్నారు. ఎన్నికల సంఘం దీని పై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందా అనే ఉత్కంఠ ప్రభుత్వంలో కనిపించింది. అయితే, ఎటువంటి అభ్యంతరా లు వ్యక్తం కాలేదు.
5న పసుపు - కుంకుమ నిధులు..
ఎన్నికల్లో డ్వాక్రా మహిళల ఓట్ల మీద ఆశలు పెట్టుకున్న టిడిపి పసుపు - కుంకుమ పధకాన్ని అమలు చేస్తోంది. ఎన్ని కల షెడ్యూల్ కు ముందుగానే రెండు విడతలు విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన మూడో విడత నగదు జమ చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులు ఏ రకంగా అయితే నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసారో అదే విధంగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సం ఘం నుండి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం 3900 కోట్లు విడుదల చేయనుంది. తొలి విడతలో 2500, రెండో విడతలో 3500 కోట్లు విడుదల చేసారు. మిగిలిన నాలుగు వేల రూపాయాలను ఈ నెల 5న ఖాతాల్లో జమ చేస్తార ని చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నిధుల విడుదల విషయంలో సైతం రాజకీయంగా ప్రయోజనం చూస్తూనే..సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది.
వారి ఓట్లన్నీ టిడిపికేనా..అదే ధీమా..
తాము సరిగ్గా ఎన్నికల వేళ సాధారణ పెన్షన్ల తో పాటుగా అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ, రైతు రుణ మాఫీ పెండింగ్ లో ఉన్న 4,5విడతల సొమ్ము నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయటం ద్వారా ఖచ్చితంగా ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉంటుందని టిడిపి అంచనా వేస్తోంది. ముందుగానే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపి ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు సరిగ్గా పోలింగ్ కు నాలుగు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ఇదే సమయంలో వైసిపి అధినేత మాత్రం చంద్రబాబు ఇస్తు న్న నగదు ను చూసి మోస పోవద్దని..తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలను పూర్తి స్థాయిలో రద్దు చేస్తా మని హామీ ఇస్తున్నారు. అయితే, టిడిపి మాత్రం కోటిన్నార మంది లబ్ది దారులు ఖచ్చితంగా తమ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.