యనమల అల్లుడు రిలీవ్: ఐఆర్ఎస్ గోపీనాథ్ డిప్యుటేషన్ రద్దు: అవినీతి ఆరోపణలు..కానీ...!
టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు. ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకట గోపీనాథ్ డిప్యుటేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. గోపీనాధ్ కోరిక మేరకు ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 26 వరకూ డిప్యూటేషన్ ఉన్నప్పటికీ గోపీనాథ్ రద్దు చేయాలని కోరారు.
దీంతో మాతృ శాఖ అయిన సెంట్రల్ డైరెక్ట్ టాక్స్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో వైద్యారోగ్య శాఖలో పని చేసిన గోపీనాధ్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గోపీనాధ్పై చర్యలు తీసుకోవాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాగా, ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిన రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ చేసింది.
ఐఆర్ఎస్ గోపీనాథ్ డిప్యుటేషన్ రద్దు..
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారి సిహెచ్.వెంకట గోపీనాథ్ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకీ డిప్యుటేషన్ పైన వచ్చిన కేంద్ర సర్వీసు అధికారులు..ఇప్పుడు తిరిగి కేంద్రానికి వెళ్లిపోతున్నారు. తాజాగా.. ఇదే కేడర్ కు చెందిన జాస్తి కిషోర్ పైన రాష్ట్ర ప్రభత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అంతకు ముందు ఏపీ మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరిని రిలీవ్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా ఇద్దరు జీఏడీ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఆ ఉద్యోగుల పైన సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇక, ఇప్పుడు కిషోర్ విషయంలో రాజకీయంగానూ వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేత బంధువును రాష్ట్ర సర్వీనుల నుండి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చర్యలకు సీఎస్ సిఫార్సు చేసినా..
ప్రస్తుతం ప్రభుత్వం రిలీవ్ చేసిన ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకట గోపీనాథ్ పైన గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన పైన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన గోపీనాథ్పై ప్రభుత్వం పలు విచారణలు చేసింది. ఆయన్ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
2015లో 3 ఏళ్ల డిప్యుటేషన్పై ఆయన రాష్ట్రానికి వచ్చారు. అనంతరం మరో రెండేళ్ల పాటు డిప్యుటేషన్ను పొడిగించారు. వచ్చే ఏడాది జూలై వరకూ గడువు ఉన్నప్పటికి.. తనను రిలీవ్ చేయాలని కోరడంతో ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి చర్యలకు సిఫార్పు చేసినా..ప్రభుత్వ స్పందించకపోవటం..అందునా యనమల అల్లుడు కావటంతో ఇప్పుడు గోపీనాధ్ రిలీవ్ ఉత్తర్వుల పైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications