పవన్ సీరియస్ - ఎట్టకేలకు భీమవరం డీఎస్పీపై వేటు..!!
భీమవరం డీఎస్పీ పై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. గతంలో డీఎస్పీ జయసూర్య పైన గతంలో డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయన పైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని పవన్ ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఈ డీఎస్పీ విషయంలో రఘురామ స్పందించారు. కాగా, ఎట్టకేలకు ఇప్పుడు జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భీమవరం డీఎస్పీ జయసూర్యను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత కాలం క్రితం జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై వెంటనే చర్యలు ఉపక్రమించారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో దీనిపై ఫోన్లో చర్చించారు. డీఎస్పీకి సంబంధించిన వ్యవహారంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి పవన్ ఆదేశాలు జారీ చేశారు.

దీనికి కొనసాగింపుగా అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉపముఖ్యమంత్రి సూచించారు. పవన్ సీరియస్ తరువాత ఈ వ్యవహారం పైన డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారన్నారు. అందుకే డీఎస్పీ పైన అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. కాగా.. ఇప్పుడు జయసూర్య ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో రఘు వీర్ విష్ణును నియమించారు. ఇప్పుడు ఈ బదిలీ వ్యవహారం పైన జిల్లాలో రాజకీయంగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications