సెలవుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి: సీఈసీకి కేబినెట్ అజెండా : నిర్ణయం పైనే ఉత్కంఠ..!
ఏపీ కేబినెట్ సమావేశం పైన సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ అజెండాను ఆమోదించిన స్క్రీనింగ్ కమిటీ..కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలపాలని కోరుతూ సీఈవోకు లేఖ సీఎస్కు లేఖ రాసారు. దీనిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో.. ఇప్పుడు సీఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు సీఈవో ద్వివేదీ సెలవు పైన వెళ్లారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది.

ఎన్నికల సంఘానికి కేబినెట్ అజెండా..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో కేబినెట్ నిర్వహణ అంశం వివాదాస్పదం అయింది. అయితే, దీని పైన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులతో సమీక్షించి..కేబినెట్ అజెండా ఖరారు చేస్తే..దాని పైన ఎన్నికల సంఘం అనుమతితో కేబినెట్ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసారు. దీంతో..నాలుగు అంశాలతో కేబినెట్ అజెండా సిద్దం కాతా..సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ చర్చించి ఆమోదించింది. రాష్ట్రంలో ఫణీ తుఫాను ప్రభావం, తాగునీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉఫాది హామీ కూలీల ఇబ్బందులపై చర్చించేందుకు కేబినెట్ సమావేశమవుతుందని సీఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసారు. దాని పైన కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా అనుమతి ఇస్తే కేబినెట్ సమావేశం నిర్ణయించిన రోజు జరిగనుంది.

సీఈసీ నిర్ణయమే ఫైనల్..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి వచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. సీఈసీ నుంచి అనుమతి రావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందన్నారు. సోమవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేబినెట్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘన జరగకుండా ముందుగా అజెండా పంపటంతో..ఎన్నికల సంఘం ఆమోదించినా.. కేబినెట్ సమావేశంలో ఈ అజెండాకు మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడా విధాన పరమైన నిర్ణయాలు తీసుకొనే వీలు లేదు. చర్చకు వచ్చే అంశాలకు సంబంధించిన అధికారులు మినహా మిగిలిన వారు సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.

సెలవుపై సీఈవో ద్వివేదీ..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ సెలవుపై వెళ్లారు. దాదాపు రెండు నెలలకు పైగా ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్న ద్వివేదీ ఈ రోజు నుండి 15వ తేదీ వరకు సెలవు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం జరిగే రోజు ఆయన అందుబాటులో ఉండటం లేదు. కేబినెట్ సమావేశంతో ఆయనకు సంబంధం లేకపోయినా..ఎన్నికల కోడ్ అమలు చేసారా లేదా అనేది అధికారులతో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉండటంతో వారిని కలిసేందుకు ద్వివేదీ సెలవు మీద వెళ్లారు. డిప్యూటీ సీఈవో ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ద్వివేది తిరిగి
ఈనెల 16న సచివాలయానికి రానున్నారు.












Click it and Unblock the Notifications