సర్వే చెప్పిన నిజం: వారిద్దరు ఫెయిల్, పవన్ కల్యాణ్కు స్పేస్?
హైదరాబాద్: మీడియా స్టడీస్ సెంటర్ (సిఎంఎస్) సర్వే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించడం, బలాన్ని పుంజుకోవడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విఫలం కావడం వల్ల తృతీయ ప్రత్యామ్నాయానికి స్థానం ఉందని సిఎంఎస్ సర్వే తెలిపింది.
కాంగ్రెసు పని అయిపోయినట్లేనని కూడా తేల్చింది. దీంతో సర్వేను బట్టి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పేస్ ఉంటుందని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పది జిల్లాల్లో సిఎంఎస్ సర్వే నిర్వహించింది.
బాబు, జగన్లకు సర్వే షాక్: కెసిఆర్కు ఆంధ్ర మార్కులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో విఫలమైందని సర్వే తేల్చింది. చంద్రబాబు పాలన ప్రారంభమై రెండేళ్లు గడిచిన సందర్బంగా సిఎంఎస్ ఈ సర్వే నిర్వహించింది. సిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎం. భాస్కర్ రావు గురువారం సర్వే ఫలితాలను వెల్లడించారు.
పవన్ కల్యాణ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే సర్వే జరిగిన అభిప్రాయం కూడా కలుగుతోంది. ఈ సర్వేను 2016 మార్చి మధ్యలో రెండు స్థాయిల్లో నిర్వహించారు. తొలి దశలో జిల్లా స్థాయి ఓపినియన్ మేకర్స్ అభిప్రాయాలు తీసుకున్నారు. వారు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారు కారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఎంపిక చేసిన ఓటర్ల అభిప్రాయాలు సేకరించారు.