శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ మిస్సింగ్.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్... ఏం జరిగి ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించిన శిరోముండనం ఘటనలో బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ వర ప్రసాద్ భార్య కౌసల్య తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిరోముండనం బాధితుడి మిస్సింగ్కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. దళిత యువకుడికి గుండు గీయించి అవమానించిన కేసులో దోషులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే చివరి ముద్ద.. : భార్యతో వర ప్రసాద్
బుధవారం(ఫిబ్రవరి 3) సాయంత్రం 4 గంటల నుంచి వరప్రసాద్ కనిపించడం లేదని అతడి వదిన తెలిపారు. సాయంత్రం ఇంటికి వచ్చే ఏదో తెలియని విచారంతో ఉన్నాడని చెప్పారు. భార్య భోజనం వడ్డించడంతో తినేందుకు కూర్చొన్నాడని... ఆ సమయంలో తనకు ఇదే చివరి ముద్ద అన్నాడని తెలిపారు. ఎక్కడకు వెళ్లినా అవమానాలే ఎదురవుతున్నాయని భార్యతో వరప్రసాద్ వాపోయినట్లు తెలిపారు. ఆవేదన తాళలేక అన్నం మధ్యలోనే వదిలేశాడని... ఇంటికి నుంచి బయటకు బయలుదేరిన అతన్ని భార్య అడ్డుకుందని చెప్పారు. ఆమె బైక్ తాళం లాక్కోవడంతో నడుచుకుంటూ ఇంటి నుంచి బయటకెళ్లినట్లు తెలిపారు.

స్నేహితులకు ఫోన్ చేస్తే...
ఆసమయంలో వర ప్రసాద్ భార్య ఆందోళనగా కనిపించిందని... అయితే, కోపంలో ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఉంటాడులే కంగారు పడొద్దని ఆమెతో చెప్పామని అన్నారు. ఆ తర్వాత వర ప్రసాద్ స్నేహితులకు ఫోన్ చేయగా... తమ వద్దకు రాలేదని వారు చెప్పడంతో అంతా టెన్షన్ పడ్డామని చెప్పారు. వర ప్రసాద్ అతని ఫోన్ను ఇంట్లోనే వదిలేసి వెళ్లాడని తెలిపారు. దీంతో సీతానగరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ నిమిత్తం సీతానగరం వచ్చిన పోలీసులు మిస్సింగ్ వ్యవహారంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని చెప్పారు.

సంచలనం రేకెత్తించిన కేసు
గతేడాది జులైలో ఇసుక మాఫియాను ఎదిరించినందుకు తూర్పు గోదావరి పోలీస్ స్టేషన్లో తనకు శిరోముండనం చేశారని,చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు వర ప్రసాద్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసును అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఆదేశించారు. బాధితుడు వరప్రసాద్కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. శిరోముండనం కేసులో వరప్రసాద్కు సహాయంగా ఉండాలని అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. అయితే జనార్దన బాబును తాను సంప్రదించినప్పటికీ... ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందనలేదని బాధితుడు ప్రసాద్ గతంలో వాపోయాడు. దీంతో ఈ కేసు ఫైల్ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications