ఆనందయ్య మందు అనుమతించండి- హైకోర్టులో పిటిషన్లు-విచారణకు స్వీకరణ
నెల్లూరులోని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీకి సంబంధించి ఓవైపు ఐసీఎంఆర్, మరోవైపు ఆయుష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ వేయడం తగదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో అందరిచూపూ నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందుపైనే నెలకొంది. ఈ సమయంలో దీని వల్ల ఎలాంటి అనర్దాలు లేవని తేల్చేందుకు ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు అధ్యయనం చేపట్టాయి. ఈ మందు వాడిన దాదాపు 500 మందిపై ఈ టీమ్లు అధ్యయనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో ఆనందయ్య మందుపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆనందయ్య మందు పంపిణీ కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీటిపై ఈ నెల 27న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ పిటిషన్లలో పిటిషనర్లు ఆనందయ్య మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని కూడా కోరారు. అలాగే మందు పంపిణీ సందర్భంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కూడా కోరారు.
లోకాయుక్త ఆదేశాల ప్రకారం మందు పంపిణీ నిలిపేసినట్లు పోలీసులు చెప్తున్నారని, కానీ లోకాయుక్తకి ఆ అధికారమే లేదనే విషయాన్ని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అసలు మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలే ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications