రైతులను ముందుంచి రాజకీయ పాదయాత్ర- ఎందుకీ నిరసనలు : హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..!!
ఏపీలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర..మూడు రాజధాల పేరుతో నిరసనల పైన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాదయాత్రకు 2వేల మందికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. ఏపీ రాజధాని అమరావతి అని కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఈ యాత్రలు, నిరసనలు ఏంటని ప్రశ్నించింది. అమరావతి పైన తీర్పులోనే స్పష్టత ఇచ్చాం కదా అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పాదయాత్ర వెనుక ఉద్దేశం ఏంటి
సుప్రీం తీర్పు వరకు వేచి చూడండని సూచించింది. రైతులను ముందుంచి రాజకీయ పాదయాత్ర చేస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై థర్డ్ పార్టీ ఎలా అప్పీల్ వేస్తుందని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ను రికార్డుల్లో చేర్చండంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతూ రైతులు మహాపాదయాత్ర చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అమరావతే రాజధాని అని ఇప్పటికే తీర్పు ఉన్న నేపథ్యంలో... అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

రౌండ్ టేబుల్ సమావేశాలు ఏంటి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులను ముందుంచి రాజకీయ పాదయాత్ర చేస్తున్నట్లుగా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కోర్టులపై ఒత్తిడి కోసమేనని భావిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
ధర్మానసం ఘాటు వ్యాఖ్యలు
రైతుల పాదయాత్రలో కేవలం 600 మందే పాల్గొనాలని, సంఘీభావం తెలిపేవారు రోడ్డుకు ఇరుపక్కలా నిలబడి మద్దతివ్వాలని సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారని.. ఆ ఉత్తర్వులు పిటిషనర్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం కర్నూలులో నిరసనలను ప్రోత్సహిస్తోందని.. 3రాజధానులకు అనుకూలంగా మంత్రులు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. తాము తీర్పు ఇచ్చాక కూడా పాదయాత్రలు - నిరసనలు అభినందించదగిన చర్యలు కావని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమరావతి పరిరక్షణ సమితి ఉల్లంఘించిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు.












Click it and Unblock the Notifications