మూడు రాజధానుల కేసు విచారణ - తరలింపుపై స్టే కొనసాగింపు : మధ్యంతర ఉత్తర్వుల సడలింపపు..!!
మూడు రాజధానుల బిల్లు వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తాజాగా తాము తీసుకొచ్చిన మూడు రాజధానులు... సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకుంటూ బిల్లు ఆమోదించింది. శాసనసభ...మండలిలో ఈ ఉపసంహరణ బిల్లు కు ఆమోదం లభించింది. దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్..మండలి ఛైర్మన్ ఆ ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఇచ్చిన లేఖలతో సహా..ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఏపీ రాజధాని బిల్లల ఉపసంహరణ కేసు విచారణ జరిగింది.
ఉప సంహరణ బిల్లులోనూ మూడు రాజధానులంటూ
పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు శ్యామ్దివాన్, సురేష్ ప్రభుత్వం ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పిందని కోర్టుకు నివేదించారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధానని... మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతుందన్న పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలన్న లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. అయితే, ప్రభుత్వం ఉపసంహరిచుకున్న బిల్లులపైన గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
గవర్నర్ నోటిఫికేషన్ పెండింగ్
గవర్నర్ వద్దకు ఈ ఉప సంహరణ బిల్లు పంపామని..అయితే, ఆయన అనారోగ్యం కారణంగా వాటి పైన నిర్ణయం తీసుకోలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దీంతో..గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసం నిర్ణయించింది. ఇదే సమయంలో చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని హైకోర్టు వెల్లడించింది. అయితే, ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్కో ఉత్తర్వులు కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.
కార్యాలయాల తరలింపు పై స్టే కంటిన్యూ
గవర్నర్ ఆమోదంతో వచ్చిన తరువాత ఆ బిల్లులను పరిశీలించి పిటీషనర్ల వాదన పైన ధర్మాసనం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో..మూడు రాజధానుల విషయంలో అటు ప్రభుత్వం వేసే అడుగులు..ఇటు న్యాయపరంగా చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి నెలకొని ఉంది.
ముఖ్యమంత్రి జగన్ సభలోనే తాము అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని..ఇప్పుడు ఉన్న బిల్లులను ఉపసంహరించుకొని..మరింత మెరుగైన బిల్లును సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఇక, మరో వైపు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో యాత్ర నిర్వహిస్తున్నారు.